
PC: X
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.
పరస్పరం హుందా ప్రకటనలు
‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.
ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.
అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.
మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!
కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.
ఓపెనర్గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.
ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 79 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.