వైజాగ్‌లో భారత్, కివీస్‌ టి20 | New decisions in BCCI Apex Council | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో భారత్, కివీస్‌ టి20

Jun 15 2025 1:30 AM | Updated on Jun 15 2025 1:30 AM

New decisions in BCCI Apex Council

అక్టోబర్‌ 15 నుంచి రంజీ ట్రోఫీ 

ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ‘సూపర్‌ లీగ్‌’ దశ 

బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో కొత్త నిర్ణయాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో కివీస్‌ 3 వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన వేదికలు, షెడ్యూల్‌ను అపెక్స్‌ కౌన్సిల్‌ శనివారం ఖరారు చేసింది. జనవరి 11న ప్రారంభం కానున్న ఈ పర్యటన 31 జనవరితో ముగియనుంది.

11న బరోడాలో తొలి వన్డే, 14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, 18న ఇండోర్‌లో మూడో వన్డే జరగనున్నాయి. ఇక నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటి, విశాఖపట్నం, త్రివేండ్రంలో టి20 సిరీస్‌ జరగనుంది. జనవరి 28న భారత్, న్యూజిలాండ్‌ నాలుగో టి20 మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకటి హైదరాబాద్‌ వేదికగా జరగడం ఖాయమే అని అంతా భావించినా... అపెక్స్‌ కౌన్సిల్‌ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.  

రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల... 
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2025–26వ సీజన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. రెండు దశలుగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌ ప్లేట్‌ గ్రూప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు... ఎలైట్‌ గ్రూప్‌నకు అర్హత సాధించనుంది. ఎలైట్‌లో పేవల ప్రదర్శన చేసిన ఒక జట్టు తదుపరి సీజన్‌లో ప్లేట్‌ గ్రూప్‌నకు పరిమితం కానుంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్‌ కౌన్సిల్‌లో నిర్ణయించారు. 

గతేడాది రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌లో ఆడిన మేఘాలయ జట్టు ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో ఆట నాణ్యత దెబ్బతింటుందని భావించిన అపెక్స్‌ కౌన్సిల్‌... ఈశాన్య రాష్ట్రాల జట్ల నుంచి ఎలైట్‌ గ్రూప్‌నకు ప్రమోషన్‌ ఇచ్చే పద్ధతిని పక్కన పెట్టింది. అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 19 వరకు తొలి దశ రంజీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండో దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 28 వరకు నాకౌట్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఆగస్టు 28 నుంచి జోనల్‌ ఫార్మాట్‌లో దులీప్‌ ట్రోఫీ జరగనుంది. అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు ఇరానీ కప్‌ నిర్వహించనున్నారు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉన్న క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల తరహాలో కాకుండా... ఈ సీజన్‌ నుంచి ‘సూపర్‌ లీగ్‌’ నిర్వహించనున్నారు. నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 18 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. 

దేవజిత్‌ సైకియా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో విజేతగా నిలిచిన అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతించెందడంతో అపెక్స్‌ కౌన్సిల్‌ ఉత్సవాలకు సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించనుంది. ఇందు కోసం బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా నేతృత్వంలో త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి ప్రభ్‌తేజ్‌ సింగ్‌ భాటియా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది. ‘ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని అపెక్స్‌ కౌన్సిల్‌ ఒక కొత్త కమిటీని నియమించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ కమిటీ విధివిధానాలు సిద్ధం చేయనుంది’ అని బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement