ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఈ డీల్ ప్రకారం.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగి రానుండగా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారికంగా ధ్రువీకరించింది.
రూ. 12 కోట్లు కట్
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ను రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. లక్నో ఫ్రాంచైజీ అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అతడు మాత్రం లక్నో యాజమాన్యం అంచనాలను అందుకోలేకపోయాడు. వరుసగా 2025, 2026 సీజన్లలో లక్నో కనీసం ప్లేఆఫ్స్కు కూడా అర్హత సాధించలేక పట్టికలో ఆఖరి స్ధానాలకు పరిమితమైంది.
రిషబ్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో 2026 సీజన్ ముగియగానే పంత్ లక్నో కెప్టెన్సీ పదవి నుండి తప్పుకున్నాడు. అయితే పంత్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు తిరిగొచ్చేందుకు తన జీతాన్ని రూ.15 కోట్లకు తగ్గించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ పేకట్తో ట్రేడ్ అయిన ప్లేయర్ మరొకరు లేరు.
అంటే గత సీజన్తో పోలిస్తే పంత్ రూ. 12 కోట్లు నష్టపోనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్తో తన ఐదేళ్ల బంధానికి కుల్దీప్ వీడ్కోలు పలకనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ను రూ. 13.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. అదే ధరతో అతడు లక్నో తరపున ఆడనున్నాడు. ఢిల్లీ తరపున కుల్దీప్ 65 మ్యాచ్లలో 72 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Ravindra Jadeja: వన్డే జట్టులో ‘సర్’ స్థానానికి ఎసరు....? గంభీర్, అగార్కర్ కొత్త వ్యూహం!


