బుల్లెట్‌ దిగింది... | Indian shooters won seven medals in one day | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ దిగింది...

Sep 28 2023 1:57 AM | Updated on Sep 28 2023 1:57 AM

Indian shooters won seven medals in one day - Sakshi

చైనా గడ్డపై భారత తుపాకీ గర్జించింది. ఒకే రోజు మన షూటర్లు ఏకంగా ఏడు పతకాలతో అదరహో అనిపించారు. స్టెతస్కోప్‌ను వదిలేసి రైఫిల్‌ ఎత్తిన సిఫ్ట్‌ కౌర్‌ సామ్రా కొత్త  ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం సొంతం చేసుకుంది. తెలంగాణ టీనేజ్‌ షూటర్‌ ఇషా సింగ్‌ డబుల్‌ ధమాకా సృష్టించింది. పిస్టల్‌ ఈవెంట్‌లో ఇషా సభ్యురాలిగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిపించగా... వ్యక్తిగత విభాగంలో ఇషా రజత పతకంతో మురిపించింది. స్కీట్‌ ఈవెంట్‌లో అనంత్‌ జీత్‌ సింగ్‌ రెండు పతకాలతో భారత  బృందంలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

సెయిలింగ్‌లో విష్ణు శరవణన్‌ కాంస్య పతకం గెలిచాడు. మహిళల వుషు సాండా ఈవెంట్‌లో రోషిబినా దేవి ఫైనల్‌ చేరి... పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌లో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ జోడీ సెమీఫైనల్‌ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. వెరసి ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలు చేరాయి. ఓవరాల్‌గా 22 పతకాలతో భారత్‌ ఏడో స్థానంలో ఉంది.   

హాంగ్జౌ: గురి తప్పని లక్ష్యంతో భారత షూటర్లు ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. బుధవారం ఏకంగా ఏడు పతకాలతో తమ సత్తా చాటుకున్నారు. ఈ ఏడు పతకాల్లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉండటం విశేషం. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో సిఫ్ట్‌ కౌర్‌ సామ్రా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్‌ కౌర్‌ 469.6 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

467 పాయింట్లతో బ్రిటన్‌ షూటర్‌ సియోనైడ్‌ మెకింటోష్‌ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును 22 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన ఆశి చౌక్సీ 451.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించకుంది. ప్రపంచ చాంపియన్‌ కియోంగ్‌యు జాంగ్‌ (చైనా; 462.3 పాయింట్లు) రజతం కైవసం చేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో సిఫ్ట్‌ కౌర్, ఆశి చౌక్సీ, మానిని కౌశిక్‌లతో కూడిన భారత జట్టు 1764 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించింది.

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ ప్రాంతానికి చెందిన సిఫ్ట్‌ కౌర్‌ ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ రైఫిల్‌ షూటింగ్‌లో కొనసాగింది. అయితే షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో సిఫ్ట్‌ కౌర్‌కు మంచి ఫలితాలు వస్తుండటంతో ఏడాది తర్వాత ఆమె వైద్య విద్యకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిస్థాయిలో ఈ క్రీడపై దృష్టి సారించింది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని తాజా ఫలితం నిరూపించింది. 

అంతకుముందు మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లోనూ భారత షూటర్లు ఇషా సింగ్, రిథమ్‌ సాంగ్వాన్, మనూ భాకర్‌ త్రయం మెరిసింది. క్వాలిఫయింగ్‌లో ఇషా, రిథమ్, మనూ 1759 పాయింట్లు స్కోరు చేసి టీమ్‌ విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇషా, మనూ భాకర్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కూ అర్హత సాధించారు. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ 34 పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలిచింది. మనూ భాకర్‌ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.  

పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో భారత్‌కు టీమ్‌ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం లభించాయి. అనంత్‌ జీత్‌ సింగ్, గురుజోత్‌ సింగ్, అంగద్‌ వీర్‌సింగ్‌ బాజ్వాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 355 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆరుగురు పోటీపడ్డ వ్యక్తిగత విభాగం ఫైనల్లో అనంత్‌ జీత్‌ 58 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని హస్తగతం చేసుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement