
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసి టీమిండియాకు ధీటైన సమాధానం ఇచ్చింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. గిల్ సేన ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే నాలుగో రోజు మొత్తం భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు..
ఇక నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్బంగా ఇంగ్లండ్ స్క్వాడ్లో లేని ఓ ఆటగాడు ఫీల్డింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సబ్స్ట్యూట్గా యార్క్షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా మైదానంలో అడుగుపెట్టాడు.
భారత సంతతికి చెందిన 21 ఏళ్ల వగాడియా రెండు ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అయితే జట్టులో లేని ఆటగాడు ఫీల్డింగ్కు రావడమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా లీడ్స్ టెస్టు కోసం వగాడియాతో పాటు జవాద్ అక్తర్, నోహ్ కెల్లీను 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అంపైర్ అనుమతి తీసుకుని వగాడియా సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు.
ఎవరీ వగాడియా?
21 ఏళ్ల యష్ వగాడియా.. దేశవాళీ క్రికెట్లో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యష్కు బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వగాడియా పదకొండేళ్ల వయసులోనే యార్క్షైర్ క్రికెట్ ఆకాడమీలో చేరాడు.
అకాడమీ, అండర్-18 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో తొలిసారి 2023 సంవత్సరంలో యార్క్షైర్ క్రికెట్ క్లబ్ ప్రొఫెషనల్ కాంట్రాక్టును పొందాడు. వగాడియా 2024లో వార్విక్షైర్పై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన వగాడియా.. 22 పరుగులు చేశాడు.
ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయనప్పటికీ, అతను యార్క్షైర్ సెకండ్ ఎలెవన్ మ్యాచ్లలో క్రమం తప్పకుండా ఆడుతాడు. కాగా వగాడియాకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వగాడియా మాత్రం ఇంగ్లండ్లోని న్యూకాజిల్లో జన్మించాడు.
చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్