టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ రీఎంట్రీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్-2027 కోసం సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే, తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నానని భువీ తెలిపాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు టైటిల్స్ను సొంతం చేసుకోవడంలో ఈ యూపీ పేసర్ది కీలక పాత్ర. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 28 వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్, రవి శాస్త్రి, దినేష్ కార్తీక్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం భువీని ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు తను రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
"జాతీయ జట్టు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు కాదంటాను? భారత్ తరపున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దమే. కానీ నా చేతుల్లో లేని విషయం గురుంచి ఎక్కువ నేను ఆలోచించను. నన్ను తీసుకోవాలా లేదా అన్నది సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉటుంది. అయితే నా శరీరం అలిసిపోయేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. అందుకే యూపీ టీ20 లీగ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాను.
అంతేతప్ప మెరుగ్గా రాణించి ఎవరినో ఆకట్టుకోవాలని అయితే ఇక్కడికి రాలేదు. ఐపీఎల్లో కూడా అంతే. జట్టు కోసం రాణించి మ్యాచ్లు గెలవాలన్నదే నా లక్ష్యం. ఎవరో ఏదో అన్నారని లేదా మరో చోట ఎంపికవ్వాలనే ఆశతో నేను ఆడడం లేదు" అని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువీ పేర్కొన్నాడు. కాగా భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.
చదవండి: ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్


