ఇండియ‌న్ క్రికెట్‌ ట్రైనింగ్‌ సెంటరా? లేదా ఆస్పత్రి వార్డా? | Complete List of Sidelined Indian Cricketers and Injury Details at CoE | Sakshi
Sakshi News home page

ఇండియ‌న్ క్రికెట్‌ ట్రైనింగ్‌ సెంటరా? లేదా ఆస్పత్రి వార్డా?

Aug 9 2026 9:46 AM | Updated on Aug 9 2026 10:40 AM

Complete List of Sidelined Indian Cricketers and Injury Details at CoE

భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను తలపిస్తోంది. జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు అక్కడే చికిత్స పొం‍దుతున్నారు.

మైదానంలో మెరుపులు మెరిపించాల్సిన మన స్టార్ క్రికెటర్లు సీఓఈలో గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం సీఓఈలో ఉన్న ఆటగాళ్లతో ఒక జట్టునే తాయారు చేయవచ్చు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో అత్యవసర భేటీకి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. దైనిక్ జాగరణ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం 13 మంది భారత క్రికెటర్లు సీఓఈలో ఉన్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టాప్ క్రికెటర్లు ఉన్నారు.

జస్ప్రీత్ బుమ్రా
పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఎడమ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. మోకాలి కీలులో చేరిన వాటర్‌ను తొలగించి జాయింట్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ రన్నింగ్, డ్రిల్స్ చేసే సమయంలో మోకాలిలో అతడికి ఇంకా నొప్పి ఉంది. పూర్తి స్థాయి బౌలింగ్ వర్క్‌లోడ్‌ను తట్టుకునే స్థితిలో అతడు లేడు. దీంతో జస్ప్రీత్ లంక టూర్‌కు దూరమయ్యాడు.

హార్దిక్ పాండ్యా 
ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్తేమి కాదు. ఈ బరోడా క్రికెటర్ జట్టులో కంటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు అతడు ఇంకా జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అతడు తొడ కండరాల గాయం కారణంగా సీఓఈలో చేరాడు. 

అయితే అతడు వేగంగా కోలుకోవడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ సిరీస్ ఆరంభానికి ముందు మళ్లీ అతడి గాయం తిరగబెట్టింది. దీంతో అతడు అఫ్గాన్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డేలకు దూరమయ్యాడు. అయితే తాజాగా మళ్లీ అతడు కుడి కాలి పిక్క గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్, బౌలింగ్ ఆపేయాలని డాక్టర్లు సూచించారు.

వాషింగ్టన్ సుందర్‌
తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడి కుడి కాలి తొడ కండరానికి గాయమైంది. దీంతో స్వదేశంలో అఫ్గాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లకు వాషీ దూరమయ్యాడు.

అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. దీంతో శ్రీలంక టూర్‌కు కూడా సుందర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సాయిసుదర్శన్ 
యువ బ్యాటర్ సాయిసుదర్శన్ కూడా సీఓఈలో ఉన్నాడు. కుడి కాలి బొటనవేలి నొప్పి తగ్గకపోవడంతో అతడిని శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి తప్పించారు.

శుబ్‌మన్ గిల్‌
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాజాగా ఈ జాబితాలోకి చేరాడు. శ్రీలంకతో టెస్టులకు ముందు ప్రాక్టీస్ లో గిల్ కుడిచేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్య భాగంగా వార్మాప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగలేదు. రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి (ఎడమ తొడ కండరాల గాయం), హర్షిత్ రాణా (కుడి తొడ కండరాల గాయం), ఆకాశ్ దీప్‌(వెన్ను గాయం), వరుణ్ చక్రవర్తి(ఎడమ తొడ కండరాల గాయం), రియాన్ పరాగ్ ( భుజం గాయం), సుయాష్ శర్మ(మోకాలి గాయం), యుధ్‌వీర్ సింగ్(కుడి భుజం గాయం), అశోక్ శర్మ( వెన్ను గాయం)లు కూడా తమ తమ గాయాల నుంచి కోలుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement