తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)-2026 సీజన్లో మదురై పాంథర్స్ తమ జోరును కొనసాగిస్తోంది. శనివారం దిండిగల్ వేదికగా కోవై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో మదురై పాంథర్స్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కోవై కింగ్స్ బ్యాటర్లలో బాలసుబ్రహ్మణ్యం సచిన్(43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 84), ఆండ్రే సిద్ధార్థ్(42 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 87) మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. మదురై బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ రెండు, పి. శరవణన్, గణేషన్ తలా రెండు వికెట్లు సాధించారు.
సచిన్, సిద్ధార్థ్ మెరుపులు వృథా
అనంతరం కోవై కింగ్స్ నిర్దేశించిన 240 పరుగుల భారీ లక్ష్యాన్ని మధురై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో ఊదిపడేసింది. తద్వారా టీఎన్పీఎల్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్ను విజయవంతంగా చేధించిన జట్టుగా మదురై నిలిచింది.
ఈ లక్ష్య చేధనలో మదురై కెప్టెన్ ఎన్.ఎస్. చతుర్వేద్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 121 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సిద్ధార్థ్ మహాదేవన్ (41 పరుగులు), అనిరుధ్ సీతా రామ్ (37 నాటౌట్) రాణించారు. కోవై కింగ్స్ బౌలర్లలో జాతవేద సుబ్రమణ్యన్ రెండు వికెట్లు పడగొట్టగా.. లింగేష్ ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో మదురై పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.


