
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోటీలో పొత్తు అంశంపై తమిళగ వెట్రి కళగంTamilaga Vettri Kazhagam అధినేత విజయ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. టీవీకే సింగిల్గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారాయన. గురువారం సాయంత్రం మధురై పరపతిలో జరిగిన మానాడు వేదికగా.. నాలుగు లక్షల మంది అభిమానులు,పార్టీ కార్యకర్తల కోలాహలం నడుమ విజయ్ ప్రసంగించారు.
టీవీకే భావజాల శత్రువు బీజేపీ (BJP).. రాజకీయ విరోధి డీఎంకే (DMK). ఇందులో.. ఏ కూటమికి, పార్టీకి బానిసగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. మాది స్వార్థపూరిత కూటమి కాదు. ఆత్మగౌరవ కూటమి. వచ్చే తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ పార్టీ (TVK)కి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.

బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. ఆరెస్సెస్ ముందు మనం ఎందుకు తలవంచాలి?. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయి. కులం కాదు.. మతం కాదు.. తమిళుడికే టీవీకే తరఫున ప్రాధాన్యం ఇస్తాం. కచ్చతీవులకు శ్రీలంక నుంచి స్వేచ్ఛ కల్పిస్తాం. తమిళ జాలర్లకు అప్పగిస్తాం. నీట్ రద్దు కోసం పోరాటం చేస్తాం.
రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. టీవీకే తరఫున రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపును తడతామన్నారు. తనను ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతానని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామన్నారు. ఈ క్రమంలో.. తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

అడవిలో సింహం అనేది ప్రత్యేకమైంది. అది గర్జిస్తే.. ఎనిమిది కిలోమీటర్ల దాకా వినిపిస్తుంది. అలాంటి సింహమే వేటాడేది. అడవిలో గుంటనక్కలెన్నో ఉంటాయి. కానీ, సింహం ఒక్కటే ఉంటుంది. అదే అడవికి రారాజు. సింహం ఎప్పటికీ సింహమే. ఇదే మన డిక్లరేషన్ అని సింగిల్ పోటీని మరోసారి విజయ్ ధృవీకరించారు.

నా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. కానీ నేనేంటో మీకు బాగా తెలుసు. నేను వాటిని సీరియస్గా తీసుకోను. నేను తమిళనాడు ప్రజల మాట మాత్రమే వింటాను. చిన్న నవ్వుతో విమర్శలను పక్కన పెడతాను. మా స్వరం ఆపలేని స్వరం.. మా శక్తి ఆపలేని శక్తి. రాజకీయాల్లోకి రాక ముందు.. నేను రాజకీయాలకు రాలేనన్నారు. పార్టీ స్థాపించినప్పుడు, అది సరిపోదు, ప్రజలు ఓటు వేయరని అన్నారని విజయ్ గుర్తు చేసుకున్నారు.

మదురైకి వచ్చినప్పుడు నాకు అలంగానల్లూరు జల్లికట్టు, మదురై మీనాక్షి అమ్మన్ గుర్తుకొస్తారు. ఈ గడ్డకు చెందిన కెప్టెన్ విజయకాంత్తో అనేక అనుభవాలు నాకున్నాయి. 1967, 1977 ఎన్నికల ఫలితాలు 2026లో పునరావృతం అవుతాయి. టీవీకే ఆ చరిత్రను తిరిగి రాస్తుంది అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.