చరిత్ర సృష్టించనున్న టీమిండియా | India Set for Historic 600th Test Match Against Sri Lanka on August 15th | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించనున్న టీమిండియా

Aug 10 2026 2:18 PM | Updated on Aug 10 2026 2:35 PM

India Set for Historic 600th Test Match Against Sri Lanka on August 15th

source: BCCI X

భారత క్రికెట్‌ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌తో భారత టెస్ట్‌ క్రికెట్‌లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్‌మన్‌ గిల్ నాయకత్వంలో భారత్‌ ఈ చారిత్రక టెస్ట్‌ బరిలో దిగనుంది.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా తర్వాత భారత్‌
600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ‌ భారత్‌ చరిత్ర సృష్టించనుంది.

టెస్ట్‌ క్రికెట్‌లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్‌ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.

1932లో మొదలైన ప్రయాణం
భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను 1932 జూన్‌ 25న ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్‌కు చేరుకుంది.

భారత్‌ టెస్ట్‌ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:

1వ టెస్ట్‌: 1932, ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో
 కెప్టెన్‌: సీకే నాయుడు

100వ టెస్ట్‌: 1967, ఆస్ట్రేలియాతో
 కెప్టెన్‌: మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ

200వ టెస్ట్‌: 1982, పాకిస్థాన్‌తో
 కెప్టెన్‌: సునీల్‌ గవాస్కర్‌

500వ టెస్ట్‌: 2016, న్యూజిలాండ్‌తో
 కెప్టెన్‌: విరాట్‌ కోహ్లీ

600వ టెస్ట్‌: 2026, శ్రీలంకతో
 కెప్టెన్‌: శుభ్‌మన్‌ గిల్‌

స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టం
ఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.

1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్‌ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, అజారుద్దీన్‌, సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, ధోనీ, కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్‌ తరం వరకు వచ్చింది.

ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ ఆగస్ట్‌ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్‌ కొలొంబో వేదికగా ఆగస్ట్‌ 23న మొదలవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement