ఆ పేరంటే ద్వేషం: బాక్సర్‌ మాటలకు మోదీ రియాక్షన్‌ వైరల్‌ | I hate That name: How PM Modi reacted To Indian boxer Pakistan story | Sakshi
Sakshi News home page

ఆ పేరంటే ద్వేషం: భారత బాక్సర్‌ మాటలకు మోదీ రియాక్షన్‌ వైరల్‌

Aug 10 2026 12:40 PM | Updated on Aug 10 2026 12:56 PM

I hate That name:  How PM Modi reacted To Indian boxer Pakistan story

Photo Credit: PMO/X

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్‌ గెలిచిన 39 పతకాల్లో పది బాక్సింగ్‌లో వచ్చినవే. అంకుశ్‌ పంఘాల్‌, సచిన్‌ సివాచ్‌, జాస్మిన్‌ లంబోరియా, ప్రీతి పవార్‌, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంఘాస్‌ స్వర్ణాలతో సత్తా చాటారు.

మరోవైపు.. నరేందర్‌ బెర్వాల్‌, లవ్లీనా బొర్గొహెన్‌, జాదుమణి సింగ్‌ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్‌ నరేందర్‌ బెర్వాల్‌.. పాకిస్తాన్‌ బాక్సర్‌తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు.

ఆరోజు నేనే గెలిచాను
‘‘పాకిస్తాన్‌ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. నాకొక విషయం గుర్తుకువచ్చింది సర్‌. 2015 వరల్డ్‌ మిలిటరీ గేమ్స్‌.. నా తొలి రౌండ్‌ మ్యాచ్‌ పాకిస్తాన్‌తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. పాకిస్తాన్‌ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. 

ఆరోజు నేనే గెలిచాను. అయితే, నేను, నా ప్రత్యర్థి ఇద్దరం గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నాం. ఇద్దరికీ కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్‌గా నరేందర్‌ రాణా ఉన్నారు. మీరు కూడా అప్పుడే తొలిసారి ప్రధాని అయ్యారు.

ఈ పేరును ద్వేషించడం మొదలుపెట్టాను
ఆ సమయంలో ఆ పాక్‌ బాక్సర్‌ నాతో.. ‘సోదరా నీకో మాట చెప్పనా?’ అన్నాడు. సరే ఏమిటో చెప్పమన్నాను. అప్పుడు అతడు.. ‘నీ పేరు నరేందర్‌. మీ కోచ్‌ పేరు నరేందర్‌. మీ ప్రధాన మంత్రి పేరు నరేంద్ర. ఇప్పటి నుంచి ఈ పేరును నేను ద్వేషించడం మొదలుపెట్టాను’ అని అన్నాడు’’ అని నరేందర్‌ బెర్వాల్‌ ప్రధాని మోదీకి తెలిపాడు.

మోదీ రియాక్షన్‌ వైరల్‌
దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్‌తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్‌ బెర్వాల్‌ భారత సైన్యంలో జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన అతడు.. ఆసియా క్రీడలు-2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని.. క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. 

కాగా గ్లాస్గోలో జరిగిన తాజా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ మొత్తంగా 39 పతకాలు గెలిచింది. ఇందులో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక 2030లో జరిగే కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్‌ ఇందుకు వేదిక.  

చదవండి: స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్‌ యాదవ్‌కు నో ఛాన్స్‌?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement