Sakshi News home page

మన బ్యాటర్ల విషయంలో సందేహం లేదు.. కానీ బౌలర్లే! పాక్‌ కంటే లంక మీద గెలవడమే..

Published Wed, Sep 13 2023 11:56 AM

India Win Over Sri Lanka Is More Convincing Than Pak Gambhir Explains Why - Sakshi

Asia Cup 2023- India vs Sri Lanka: పాకిస్తాన్‌పై భారీ విజయం కంటే శ్రీలంక మీద లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో గెలుపే టీమిండియాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టులోని కీలక బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనలతో కెప్టెన్‌కు పూర్తి భరోసా ఇచ్చారని పేర్కొన్నాడు. 

పాక్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించారు
ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. పటిష్ట పేస్‌ దళం కలిగిన పాకిస్తాన్‌తో పోరులో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(56), శుబ్‌మన్‌ గిల్‌(58) అర్ధ శతకాలు సాధించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(122), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌(111) అజేయ శతకాలతో దుమ్ములేపారు.

ఈ క్రమంలో 356 పరుగులు భారీ స్కోరు చేసిన రోహిత్‌ సేన.. పాక్‌ను 128 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా ఏకంగా 228 పరుగులతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగాడు.

లంక స్పిన్‌కు టీమిండియా ఆలౌట్‌
ఇక మంళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం లంక స్పిన్‌ దాటికి టీమిండియా ఆలౌటైంది. గిల్‌, కోహ్లి, రాహుల్‌ తదితరులు విఫలం కావడంతో కేవలం 213 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో.. లో స్కోరును డిఫెండ్‌ చేసుకోవడంలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించారు.

బుమ్రా రెండు, కుల్దీప్‌ నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్‌, పాండ్యా ఒక్కో వికెట్‌, జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 172 పరుగులకు లంక ఆలౌట్‌ కాగా.. 41 పరుగులతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. 

బ్యాటర్ల విషయంలో సందేహం లేదు
ఈ పరిణామాల నేపథ్యంలో గౌతం గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ మీద 228 పరుగుల తేడాతో భారీ విజయం కంటే శ్రీలంక మీద గెలుపే భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మన బ్యాటింగ్‌ యూనిట్‌ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు.

కానీ బౌలర్లు మాత్రం
అయితే, గాయం తర్వాత తిరిగొచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఎలా ఆడతాడు? కుల్దీప్‌ యాదవ్‌.. ఇతర బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే ఆందోళన ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో కొలంబో పిచ్‌పై 213 పరుగులు స్కోరు కాపాడుకోవడం సానుకూలాంశం.

స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల శ్రీలంకపై ఇలాంటి గెలుపు వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాకు బూస్ట్‌ను ఇస్తుంది. ఎందుకంటే.. బుమ్రా, కుల్దీప్‌ మంచి ఫైర్‌ మీద ఉన్నారు కదా! కెప్టెన్‌ ఇక మరింత ధీమాగా ముందుకు వెళ్లొచ్చు’’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో వ్యాఖ్యానించాడు.  

చదవండి: 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్‌ వెల్లలగే? 
అద్భుత క్యాచ్‌.. రోహిత్‌ను హత్తుకున్న కోహ్లి.. సెలబ్రేషన్‌ మామూలుగా లేదు! 

Advertisement

What’s your opinion

Advertisement