ఆసియా కప్-2025 ముగిసి దాదాపు తొమ్మిది నెలలు పూర్తైంది. అయినప్పటికీ చాంపియన్గా నిలిచిన టీమిండియా చేతికి ట్రోఫీ ఇంకా రానేలేదు. ఇప్పటికీ ఆసియా క్రికెట్ మండలి (ACC) ఈ విషయంపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో సూర్యకుమార్ సేన విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ట్రోఫీని గెలుచుకుంది.
టీమిండియా నిరాకరణ
అయితే, నాడు పహల్గామ్ ఉగ్రదాడి.. అందుకు బదులుగా ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీసీ అధ్యక్షుడు, పాక్ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది.
దీంతో నక్వీ ట్రోఫీని తనతో పాటు పాకిస్తాన్కు ఎత్తుకెళ్లిపోయాడనే వార్తలు వచ్చాయి. అంతేకాదు.. తన అనుమతి లేకుండా ఏసీసీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించవద్దని.. ట్రోఫీ ఎవరికీ ఇవ్వద్దని అతడు ఆదేశించినట్లు సమాచారం. దీంతో తొమ్మిది నెలల కాలం గడిచినా ట్రోఫీ ఇంకా టీమిండియాకు చెంతకు చేరనేలేదు.
నక్వీని అడిగినా ఇవ్వడం లేదు
ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా స్పందించారు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఆసియా కప్ ట్రోఫీ ఇంత వరకు మా చేతికి రాలేదు. ఈ విషయం గురించి మేము ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ (నక్వీ), డైరెక్టర్లతో కూడా మాట్లాడాము. ట్రోఫీ మాకు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాము.
కానీ ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. మేము వాళ్లతో మాట్లాడినా ఫలితం కనిపించలేదు. అయినా ట్రోఫీ ఉంటేనే మేము గెలిచినట్లు కాదు కదా!.. మా విజయాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అయినా సరే ట్రోఫీ మాకు ముఖ్యం. మేము గెలుచుకున్నది ఎప్పటికైనా మాకే సొంతము’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.


