హర్షిత్ రాణా (PC: BCCI)
టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు గొప్పగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇటు బంతితోనూ.. అటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు.
గంభీర్కు ప్రియశిష్యుడిగా పేరు
అయినప్పటికీ హర్షిత్ రాణాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియశిష్యుడిగా హర్షిత్ రాణాకు పేరు. గంభీర్ అండతోనే అతడు అరంగేట్రం చేయగలిగాడని.. అర్హులను కాదని మరీ హర్షిత్కు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా కొనసాగుతున్నాయి.
ఇక తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో శివం దూబేను కాదని.. హర్షిత్ను పంపించారు. అతడు 13 బంతుల్లో 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. దూబే 2 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ను ముందుగా ఎందుకు పంపించారనే ప్రశ్నలు వచ్చాయి.
అవకాశం వచ్చిన ప్రతిసారీ
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతడిని మనందరం చాలాసార్లు చాలా రకాలుగా ట్రోల్ చేశాము. కానీ అతడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు.
క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అతడి చేతికిచ్చినా మెరుగ్గానే రాణిస్తున్నాడు. బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. అయితే, కొన్నిసార్లు విఫలం కావడం సహజం. ఏదేమైనా నిందలు, తిట్లకు హర్షిత్ అర్హుడు కాదు.
నిజానికి ఐర్లాండ్తో రెండో టీ20లో దాదాపు అతడు జట్టును గెలిపించినంత పని చేశాడు. పది బంతుల్లో 21 పరుగులు చేశాడు (ఈ మ్యాచ్లో టీమిండియా ఒకే ఒక్క పరుగుతో ఓడి వైట్వాష్ అయింది). హర్షిత్ రాణా కొత్త, పాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయర్ ఆర్డర్ నుంచి కాస్త టాప్నకు ప్రమోట్ చేసినా బ్యాట్తో రాణించగలడు.
సెలక్షన్లో అతడి తప్పేమీ లేదే!
తుదిజట్టుకు ఎంపిక కావడం అతడి తప్పేమీ కాదే. అతడిని తరచూ విమర్శించే వారు బాగా ఆడినప్పుడు ఎందుకు ప్రశంసించడం లేదు. అనవసరంగా ట్రోల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు’’ అని ఆకాశ్ చోప్రా ట్రోలర్స్కు చురకలు అంటించాడు.
కాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో హర్షిత్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.


