నేడు ఇంగ్లండ్తో భారత్ ఢీ
గెలిచిన జట్టుదే వన్డే సిరీస్
మధ్యాహ్నం గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, జియో హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్పై గత మూడు రోజులుగా సాగుతున్న చర్చకు నేడు తెరపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్తోనే రోహిత్ అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వార్తలు వెలువడటంతో... అభిమానులందరి దృష్టి ‘హిట్ మ్యాన్’పైనే ఉండనుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని రోహిత్ భావిస్తున్నా... సెలక్టర్లు అందుకు సుముఖంగా లేరని రోహిత్ సన్నిహిత వర్గాలు అంటుండగా... లార్డ్స్ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరిది కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
రోహిత్ కుటుంబ సభ్యులు లండన్ చేరుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగియనుందనే వాదనకు బలం చేకూరుతోంది. అదే జరిగితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ను భారత జెర్సీలో చూడటం ఇదే చివరిసారి కానుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్లో గెలిచి ఇంగ్లండ్ లెక్క సరిచేసింది. దీంతో ఈ పోరులో గెలిచిన జట్టు సిరీస్ చేజిక్కించుకోనుంది.
రో‘హిట్’ కొట్టేనా!
గత రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఆరంభం ఆశిస్తుండగా... కెపె్టన్ శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి రావడం ఖాయం కావడంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కానున్నాడు. గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో ఎంపికైన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.
బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా మునపటి వాడి ప్రదర్శిస్తుండగా... ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ అతడికి అండగా నిలుస్తున్నారు. మరోవైపు గత మ్యాచ్లో టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోయినా... ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించిన రూట్పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది. గత మూడు వన్డేల్లోనూ నాటౌట్గా నిలచిన రూట్... భారత్పై తొలి వన్డేలో 76, రెండో వన్డేలో 99 పరుగులు చేశాడు. రూట్ నిలకడకు ఇతర బ్యాటర్ల దూకుడు తోడైతే ఇంగ్లండ్ను ఆపడం కష్టతరమే! బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది.
పిచ్ ఎలా ఉందంటే...
లార్డ్స్లో టీమిండియాకు గొప్ప రికార్డేమీ లేదు. ఈ మైదానంలో భారత జట్టు వన్డే మ్యాచ్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. చివరగా 2004లో దినేశ్ కార్తీక్ అరంగేట్రం చేసిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఓవరాల్గా ఈ మైదానంలో తొమ్మిది వన్డేలు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. అందులో 1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్ కూడా ఉంది. పిచ్ బౌలింగ్కు అనుకూలం. ఇటీవల న్యూజిలాండ్తో టెస్టు సందర్భంగా పిచ్ అనూహ్యంగా స్పందించింది. గత రికార్డు చూసుకుంటే లక్ష్యఛేదన కన్నా... మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్కు వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, శివమ్ దూబే, కుల్దీప్/హర్ష్ దూబే, బుమ్రా, గుర్నూర్, ప్రసిధ్.
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), డకెట్, బెథెల్, రూట్, బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, అట్కిన్సన్, ఆర్చర్, సాఖిబ్/టంగ్, ఆదిల్ రషీద్.


