‘మన’ ఆట ఎప్పుడో? | India is ranked 138th in the FIFA world rankings | Sakshi
Sakshi News home page

‘మన’ ఆట ఎప్పుడో?

Jul 19 2026 12:59 AM | Updated on Jul 19 2026 12:59 AM

India is ranked 138th in the FIFA world rankings

మరో ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ వచ్చింది... ఆదివారంతో ముగిసిపోతోంది కూడా! మెస్సీ మాయలో తరించాం... ఎంబాపె, హాలాండ్, డెంబెలె, మార్టినెజ్‌ మెరుపులకు జేజేలు పలికాం... మిగతా ఆటగాళ్ల విన్యాసాలను కూడా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం... కానీ ఇలా ఎప్పటి వరకు? పరాయి దేశపు ఆటగాడికి అభిమాన ప్రేక్షకుడిలా ఆటను ఆస్వాదిస్తున్నాం తప్ప ‘మనోడు’ అంటూ ఒక్కడూ మైదానంలో కనిపించడం లేదు. ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ మొదలై 96 ఏళ్లు అయినా భారత జట్టుకు ప్రాతినిధ్యమే లేదు. మైదానంలో దిగేందుకు కనీసం ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 1950 వరల్డ్‌ కప్‌లో మాత్రం భారత్‌గా నేరుగా అవకాశం లభించింది. వేర్వేరు రాజకీయ కారణాలతో పలు జట్లు తప్పుకోవడంతో ఆడేందుకు భారత్‌ను కూడా ‘ఫిఫా’ ఎంపిక చేసింది. అయితే తగిన ప్రాక్టీస్‌ లేక, జట్టు ఎంపికలో గందరగోళవంటి సమస్యలతో చివరి నిమిషంలో జట్టును పంపడం లేదని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రకటించింది. ఆ తర్వాత మన అడుగులు ఒక్కసారి కూడా అటు వైపు పడలేదు. 2026 టోర్నీలో ప్రపంచ కప్‌ను 32 నుంచి 48 జట్లకు పెంచినా... అర్హతా ప్రమాణాలకు మనం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాం. మన దేశంలో ఫుట్‌బాల్‌ స్థాయి నానాటీకీ పడిపోతున్న  ఈ స్థితిలో వరల్డ్‌ కప్‌లో ఆటను కోరుకోవడం అత్యాశే కావచ్చు.  

ప్రస్తుతం ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 138వ స్థానంలో ఉంది. ఆసియా ఖండంలోనైతే ఈ ర్యాంక్‌ 27గా ఉంది. వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో 1986, 1994, 1998లలో... ఆ తర్వాత  2002 నుంచి 2026 వరకు భారత జట్టు వరుసగా ఆసియా ఖండం నుంచి అర్హత సాధించే లక్ష్యంతో క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లు ఆడింది. అయితే ఒక్కసారి కూడా జట్టు కావాల్సిన విజయాలు సాధించి ముందంజ వేయలేకపోయింది. ఇన్నేళ్లలో ఆసియాలోని 22 జట్లతో తలపడిన భారత్‌ వరల్డ్‌ కప్‌ కోరిక మాత్రం తీరలేదు. 2026 టోర్నీలో ఆసియా నుంచి 9 జట్లకు చాన్స్‌ లభించినా భారత్‌ మాత్రం వీటిలో లేదు. 

ఈ ఖండం నుంచి ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియా, కొరియా, ఉజ్బెకిస్తాన్, ఆ్రస్టేలియా బరిలోకి దిగాయి. క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్‌లపై మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒకటే మ్యాచ్‌ గెలిచి అర్హత సాధించే అవకాశాలు చేజార్చుకుంది. మరోవైపు ఒలింపిక్స్‌లో మాత్రం భారత్‌కు అవకాశం దక్కింది. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరడం మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన. అయితే 1992 నుంచి నిబంధనలు మార్చి అండర్‌–23 టీమ్‌లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపాలని నిర్ణయించగా...ఆ తర్వాత భారత్‌ ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది.  

ప్రస్తుతం మన దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడకు అసలు ఏమాత్రం ఆదరణ లేని స్థితి, కనీస సౌకర్యాలు లేకపోవడం, నాసిరకం ప్రమాణాలకు తోడు ఏమాత్రం ముందు చూపు లేని జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) చేతగానితనం వెరసి వరల్డ్‌ కప్‌లో మన జట్టు గురించి కనీసం ఆలోచించకుండా చేస్తోంది. జట్టుగా కాకున్నా కొందరు ఆటగాళ్లయినా కనీసం తమ వ్యక్తిగత సామర్థ్యంతో విదేశీ లీగ్‌లలో ఆడటం, స్థాయిని పెంచుకోవడం లాంటివి కూడా కనిపించడం లేదు. 2030లో జరిగే వరల్డ్‌ కప్‌లో మళ్లీ జట్ల సంఖ్యను 64కు పెంచాలని ‘ఫిఫా’ యోచిస్తోంది. దాని కోసమైనా ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమై క్వాలిఫయింగ్‌ కోసం ఒక ప్రయత్నం చేయవచ్చు. తాజా స్థితిలో మాత్రం ప్రపంచకప్‌లో మన హాజరు ఇంకా సుదూర స్వప్నమే!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement