
భారత్లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవ లేదు. ఐపీఎల్ మొదలైన తర్వాత ఎంతో మంది యువ తారలు వెలుగులోకి వస్తున్నారు. పొట్టి క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టులో చోటుకు బాటలు వేసుకుంటున్నారు. దీంతో టీమిండియాలో స్థానం కోసం పోటీ మరింత పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ వెటరన్ ఆటగాడు పునరాగమనం చేయడమంటే విశేషమే.
అదీ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియా తరఫున తుదిజట్టులో ఆడే అవకాశం దక్కించుకోవడం మరీ విశేషం. కరుణ్ నాయర్ (Karun Nair) తాజాగా ఈ ఘనత సాధించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ ‘ట్రిపుల్ సెంచూరియన్’ ఇంగ్లండ్ (Ind vs Eng 1st Test)తో శుక్రవారం మొదలైన తొలి టెస్టు సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.
ఎనిమిదేళ్ల 83 రోజుల విరామం తర్వాత తిరిగి భారత్ తరఫున టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగాడు. తద్వారా టీమిండియా తరఫున సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. కాగా కరుణ్ నాయర్ చివరగా 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఆడాడు.
టీమిండియా తరఫున టెస్టుల్లో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు వీరే..
👉లాలా అమర్నాథ్- 12 ఏళ్ల 129 రోజుల తర్వాత..
👉ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ- 12 ఏళ్ల 10 రోజుల తర్వాత..
👉జయదేవ్ ఉనాద్కట్- 12 ఏళ్ల రెండు రోజుల తర్వాత..
👉దత్తారామ్ ధర్మాజీ హిండ్లేకర్- 9 ఏళ్ల 357 రోజులు తర్వాత..
👉సయ్యద్ ముస్తాక్ అలీ- 9 ఏళ్ల 336 రోజులు తర్వాత..
👉కొటారి సుబ్బన్న నాయుడు- 9 ఏళ్ల 329 రోజుల తర్వాత..
👉విజయ్ మర్చంట్- 9 ఏళ్ల 308 రోజుల తర్వాత..
👉దినేశ్ కార్తిక్- 8 ఏళ్ల 144 రోజులు తర్వాత..
👉పార్థివ్ పటేల్- 8 ఏళ్ల 107 రోజుల తర్వాత..
👉కరుణ్ నాయర్- 8 ఏళ్ల 83 రోజుల తర్వాత..
బోటు ప్రమాదం నుంచి బయటపడి...
కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో వన్డే మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది.. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీని డబుల్ సెంచరీగా.. త్రిశతకం(381 బంతుల్లో 303)గా మార్చిన మూడో క్రికెటర్గా నిలిచాడు.
ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున ఏడు టెస్టులు ఆడిన కరుణ్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి. రెండు వన్డేలు ఆడిన అతడు 46 రన్స్ చేయగలిగాడు. అయితే, 2017లో అజింక్య రహానే పునరాగమనం తర్వాత కరుణ్ నాయర్పై వేటు పడింది.
ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి సారించిన కరుణ్ నాయర్.. 2023లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో సత్తా చాటాడు. నార్తాంప్టన్షైర్ తరఫున మూడు మ్యాచ్లలో కలిపి 249 పరుగులు చేశాడు. సర్రే జట్టుపై సెంచరీ బాదాడు.
బ్యాట్తో బంతిని రపా రపా.. రఫ్పాడించి!
ఇక అదే ఏడాది రంజీల్లో విదర్భ జట్టును ఫైనల్కు చేర్చడంలో కరుణ్ కీలక పాత్ర పోషించాడు. మరుసటి సీజన్లో విదర్భ తరఫున విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఏకంగా 779 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలో అదే ఏడాది 863 పరుగులు చేశాడు. విదర్భకు టైటిల్కు అందించడంలో అతడిది ముఖ్య భూమిక.
అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా-ఎ తరఫున బరిలోకి దిగి.. డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియాకు ఎంపికైన కరుణ్ నాయర్ తాజాగా తొలి టెస్టుతో రీ ఎంట్రీని ఖరారు చేసుకున్నాడు.
కాగా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఏడాదే కరుణ్ నాయర్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలో ఆలయాన్ని దర్శించుకునే నిమిత్తం వెళ్లిన అతడు.. పంపా నదిలో జరిగిన బోటు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.