టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. సాయి సుదర్శన్‌ అరంగేట్రం.. కరుణ్‌ ఉన్నాడా? | Ind vs Eng 1st Test 2025 Toss Update Playing XIs Sai Sudharsan Debut | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌.. సాయి సుదర్శన్‌ అరంగేట్రం.. కరుణ్‌ ఉన్నాడా?

Jun 20 2025 3:03 PM | Updated on Jun 20 2025 3:47 PM

Ind vs Eng 1st Test 2025 Toss Update Playing XIs Sai Sudharsan Debut

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌- టీమిండియా (Eng vs Ind) మధ్య టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. గిల్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇక ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్థానం మొదలు కాగా.. చెన్నై చిన్నోడు సాయి సుదుర్శన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా నయా వాల్‌, వెటరన్‌ క్రికెటర్‌, ప్రస్తుత కామెంటేటర్‌ ఛతేశ్వర్‌ పుజారా చేతుల మీదుగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ క్యాప్‌ అందుకున్నాడు.

ఈ సందర్భంగా భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాట్లాడుతూ.. టాస్‌ గెలిస్తే తాను కూడా బౌలింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. బెకింగ్‌హామ్‌లో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడటం అద్బుతంగా అనిపించిందని.. సిరీస్‌లో శుభారంభం అందుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

అదే విధంగా సాయి సుదర్శన్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని.. కరుణ్‌ నాయర్‌కు కూడా తుది జట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా దశాబ్ద కాలం తర్వాత విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లేకుండా భారత్‌ టెస్టు సిరీస్‌ ఆడటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందే ఈ ఇద్దరూ సంప్రదాయ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

విమాన ప్రమాద మృతులకు నివాళిగా
కాగా తొలి టెస్టు సందర్భంగా అహ్మదాబాద్‌ విమాన ప్రమాద బాధితులకు ఇరుజట్ల ఆటగాళుల సంతాపం ప్రకటించారు. నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు.. బ్లాక్‌ ఆర్మ్‌బ్యాండ్లతో బరిలోకి దిగారు. జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 181 మంది భారత ప్రయాణికులతో పాటు 53 మంది బ్రిటిష్‌ పౌరులు మృతి చెందారు.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు
వేదిక: హెడింగ్లీ మైదానం, లీడ్స్‌
టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌

తుదిజట్లు
భారత్‌
🏏యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.

ఇంగ్లండ్‌
🏏జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement