Photo Credit: BCCI
ఇంగ్లండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. లార్డ్స్లో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో 387 పరుగులు చేసింది.
గాయాల వల్ల ఇద్దరూ దూరం
లక్ష్య ఛేదనలో భారత్ 360 పరుగులకే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 2-1తో ఇంగ్లండ్ సొంతమైంది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మ్యాచ్ ఆడలేకపోయాడు.
గిల్ కీలక వ్యాఖ్యలు
బుమ్రా, వాషీ స్థానాల్లో అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మూడో వన్డే ఆడారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందన్నాడు. ఈ మేరకు.. ‘‘ఒక ఆటగాడు గాయపడితే కూర్పు ఒకలా ఉంటుంది.
ఒకరి కంటే ఎక్కువ మంది గాయపడితే జట్టు కాంబినేషన్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతీ మ్యాచ్ తర్వాత ఒక ఆటగాడు గాయపడతున్నాడంటే మేము ఎక్కడో ట్రిక్ మిస్ అవుతున్నామని అనిపిస్తోంది.
ఎక్కడో చోట తేడా కొడుతుంది
ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము 11 మ్యాచ్లు వరుసగా ఆడాల్సి ఉంది. అయితే, తరచూ గాయాల బారిన పడే ఆటగాళ్లు ఈ సిరీస్లో రెండు లేదంటే మూడు మ్యాచ్లు మిస్ కావొచ్చు. ఇలా ఎక్కడో చోట తేడా కొడుతుంది. తరచూ గాయపడే ప్లేయర్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడతాడు.
ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల వల్ల దూరమవుతాడు. అలాంటి సమయంలో కొత్త ప్లేయర్ను ఆడించాల్సి ఉంటుంది. నిజానికి తుదిజట్టును తరచూ మార్చాలనే ఆలోచన మాకు లేదు. కానీ గాయాల వల్ల తప్పక ఇలా చేయాల్సి వస్తోంది.
ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. కొంతమంది 80 శాతం ఫిట్గా ఉన్నా సరే ఆడటానికి ముందుకు వస్తారు. అయితే, మేము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. అందులో ఒకరు కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తామంటే కుదరదు కదా!
మెరుగుపడాల్సిందే
పూర్తి ఫిట్గా ఉంటేనే వారు పది ఓవర్లు బౌల్ చేయగలరు. కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఏదేమైనా జట్టుగా మేము ఫిట్నెస్ ప్రమాణాలను మరింతగా మెరుగపరచుకోవాల్సి ఉంది’’ అని శుబ్మన్ గిల్ పేర్కొన్నాడు.
తరచూ గాయాలు
కాగా పేస్ దళ నాయకుడు బుమ్రా తరచూ గాయపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలల తర్వాత ఇంగ్లండ్తో తొలి వన్డే సందర్భంగా ఇటీవలే అతడు యాభై ఓవర్ల ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండు మ్యాచ్లు ఆడగానే.. మోకాలి గాయంతో కీలకమైన మూడో వన్డేకు దూరమయ్యాడు.
అంతేకాదు బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో మేనేజ్మెంట్ అతడికి తరచూ విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో గిల్ ఒక రకంగా బుమ్రా ఫిట్నెస్ ప్రమాణాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రస్తావన తేవడం ద్వారా ఈ పేస్ గుర్రానికి గిల్ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా యూకే పర్యటనలో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీ20 సిరీస్లో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా వన్డే సిరీస్నూ కోల్పోయి ఓటమితో నిష్క్రమించింది.


