తిరుగులేని టీమిండియా.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్ర | Sakshi
Sakshi News home page

తిరుగులేని టీమిండియా.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న జైత్రయాత్ర

Published Mon, Feb 26 2024 5:59 PM

IND VS ENG 4th Test: 17th Consecutive Test Series Win For India At Home - Sakshi

స్వదేశంలో టీమిండియా విజయపరంపర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో భారత జట్టు స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన టీమిండియా జైత్రయాత్ర ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ వరకు అప్రతిహతంగా సాగుతుంది.

ప్రపంచంలో ఏ జట్టు స్వదేశంలో వరుసగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. భారత్‌ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. భారత్‌, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్‌ (1976-1986), న్యూజిలాండ్‌ (2017-2021) జట్లు స్వదేశంలో 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి.

స్వదేశంలో టీమిండియా సాధించిన 17 సిరీస్‌ (వరుసగా) విజయాలు.. 

  1. ఆస్ట్రేలియాపై 4-0
  2. వెస్టిండీస్‌పై 2-0
  3. సౌతాఫ్రికాపై 3-0
  4. న్యూజిలాండ్‌పై 2-0
  5. ఇంగ్లండ్‌పై 4-0
  6. బంగ్లాదేశ్‌పై 1-0
  7. ఆస్ట్రేలియాపై 2-1
  8. శ్రీలంకపై 1-0
  9. ఆఫ్ఘనిస్తాన్‌పై 1-0
  10. వెస్టిండీస్‌పై 2-0
  11. సౌతాఫ్రికాపై 3-0
  12. బంగ్లాదేశ్‌పై 2-0
  13. ఇంగ్లండ్‌పై 3-1
  14. న్యూజిలాండ్‌పై 1-0
  15. శ్రీలంకపై 2-0
  16. ఆస్ట్రేలియాపై 2-1
  17. ఇంగ్లండ్‌పై 3-1 (మరో మ్యాచ్‌ మిగిలి ఉంది)

ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్‌ జురెల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్‌) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

స్కోర్‌ వివరాలు.. 

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 353 (రూట్‌ 122 నాటౌట్‌, జడేజా 4/67)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307 (దృవ్‌ జురెల్‌ 90, షోయబ్‌ బషీర్‌ 5/119)
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 145 (జాక్‌ క్రాలే 60, అశ్విన్‌ 5/51)
  •  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 192/5 (రోహిత్‌ శర్మ 55, షోయబ్‌ బషీర్‌ 3/79)
  • 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: దృవ్‌ జురెల్‌

Advertisement
Advertisement