అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ | ICC-Punished Prabath Jayasuriya Breach-ICC Code Of-Conduct-2nd Test | Sakshi
Sakshi News home page

అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ

Aug 25 2026 4:24 PM | Updated on Aug 25 2026 4:41 PM

ICC-Punished Prabath Jayasuriya Breach-ICC Code Of-Conduct-2nd Test

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతు రెండో టెస్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పటికే జైస్వాల్‌, అసితా ఫెర్నాండో వివాదంపై సీరియస్ అయిన ఐసీసీ వారిద్దరికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక బౌలర్‌ ప్రబాత్ జయసూరియా కూడా చేరిపోయాడు. 

రెండో రోజు ఆట చివర్లో వెలుతురు మందగించడంతో తాము ఆడలేమంటూ జయసూరియా అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ అంపైర్లు ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్లతో వాదన జరిగిన మరుక్షణమే ప్రబాత్ ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ వెళుతూ బౌండరీ లైన్ వద్ద కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ, గ్లౌజులను విసిరేశాడు. ప్రబాత్ జయసూరియా చర్యలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో చర్యలకు ఉపక్రమించింది.

‘‘అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రబాత్ జయసూరియా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. 

అందుకే క్రమశిక్షణా చర్య కింద ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నాం. గత రెండేళ్లలో అతడికి ఇదే మొదటి ఉల్లంఘన కావడంతో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని చెప‍్పుకొచ్చింది. అనంతరం ప్రబాత్ జయసూరియ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు.

అసలేం జరిగిందంటే?
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. లంక తొలి వికెట్ కోల్పో‍వడంతో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ప్రబాత్ జయసూరియా వెలుతురు సరిగా లేదని, ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు.  

ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read: లంక కెప్టెన్‌ను ట్రాప్‌ చేసిన సర్ఫరాజ్‌; ఏం జ‌రిగిందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement