కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్‌దే ఆధిపత్యం | Sri Lanka Trail By 495 Runs-Vs IND 2nd Test-Day-2 Stumps-Colombo | Sakshi
Sakshi News home page

SL Vs IND: కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్‌దే ఆధిపత్యం

Aug 24 2026 6:12 PM | Updated on Aug 24 2026 6:24 PM

Sri Lanka Trail By 495 Runs-Vs IND 2nd Test-Day-2 Stumps-Colombo

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదికగా భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్‌ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్‌ సుతార్‌, ప్రసిధ్‌ క్రిష్ణలు చెరో వికెట్‌ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి రోజులాగే రెండో రోజు ఆటలో కూడా భారత్‌దే ఆధిపత్యం. పడిక్కల్‌, జురెల్‌ శతకాలతో చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్‌లో మానవ్‌ సుతార్‌, ప్రసిధ్‌ క్రిష్ణలు చెలరేగడంతో లంకకు ఆదిలోనే షాకులు తగిలాయి.

అంతకముందు తమ తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది .బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భార‌త బ్యాట‌ర్లు చెల‌రేగ‌డంతో తొలి టెస్టు త‌ర‌హాలోనే రెండో టెస్టులోనూ భార‌త్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం క‌న‌బ‌రిచింది. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచ‌రీల‌తో చెల‌రేగారు. 

మిగతా బ్యాటర్లలో వికెట్‌ కీప‌ర్ రిష‌బ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధ‌సెంచ‌రీలు సాధించగా, జైస్వాల్ (45), జ‌డేజా (43) రాణించారు. లంక బౌల‌ర్ల‌లో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయ‌గా, కెషారా నువంతా, ప్ర‌బాత్ జ‌య‌సూరియ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఓవ‌ర్‌నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 ప‌రుగుల వ‌ద్ద డెబ్యూ ఆట‌గాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావ‌డంతో ఆరో వికెట్ కోల్పోయింది. 

మొద‌టి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగిన రిష‌బ్ పంత్ మ‌ళ్లీ క్రీజులోకి వ‌చ్చాడు. ధ్రువ్ జురెల్‌తో క‌లిసి పంత్ ఇన్నింగ్స్‌ను న‌డిపించాడు. ఈ ఇద్ద‌రు క‌లిసి ఏడో వికెట్‌కు 152 బంతుల్లో 112 ప‌రుగులు జోడించారు. ఈ క్ర‌మంలోనే పంత్‌, జురెల్‌లు హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. వ‌ర్షం అంత‌రాయంతో టీ బ్రేక్ స‌మ‌యానికి భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 475 ప‌రుగుల వ‌ద్ద నిలిచింది. 

వ‌ర్షం త‌ర్వాత భార‌త్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగ‌క‌పోయిన‌ప్ప‌టికీ, జురెల్ త‌న కెరీర్‌లో రెండో టెస్టు సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత సిరాజ్ (3) ఔట‌వ్వ‌డంతో భార‌త్ 489 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత జురెల్ ఒక సిక్స‌ర్ స‌హా రెండు ఫోర్లు కొట్ట‌డంతో టీమిండియా స్కోరు 500 ప‌రుగుల మార్క్ దాటింది. వెంట‌నే కెప్టెన్ గిల్ 503 ప‌రుగుల వ‌ద్ద భార‌త ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

Read: వైభ‌వ్ సూర్య‌వంశీ ప్లాఫ్ షో వెనుక కార‌ణ‌మిదే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement