ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్‌పై పంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ | Gambhir Slammed For response to Pant Twin centuries in Leeds Test | Sakshi
Sakshi News home page

ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి.. గంభీర్‌పై పంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Jun 25 2025 5:28 PM | Updated on Jun 25 2025 5:41 PM

Gambhir Slammed For response to Pant Twin centuries in Leeds Test

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ తీరు (Gautam Gambhir)పై స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో అద్భుత శతకాలు బాదిన ఆటగాడిని తక్కువ చేసినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. వేరే వాళ్లను ప్రశంసించడంలో తప్పులేదని.. కానీ అందుకోసం పంత్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఇంతలా అసహనం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విషయం ఏమిటంటే.. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం ఆరంభించాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది.

ఐదు శతకాలు
ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడు సెంచరీలు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (101)తో పాటు కెప్టెన్‌ గిల్‌ (147), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (134) కూడా శతకాలతో అలరించారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (4), గిల్‌ (8) విఫలం కాగా.. మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (137), పంత్‌ (118) సెంచరీలు బాది.. జట్టును ఆదుకున్నారు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యం విధించగలిగింది.

అయితే, ఆఖరి రోజు వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు శతకాలు బాదినా టీమిండియాకు పరాభవమే మిగిలింది. ఫీల్డింగ్‌, బౌలర్ల వైఫల్యం కారణంగా ఓటమిని చవిచూసింది.

ఆ రెండే కాదు.. మరో మూడు ఉన్నాయి
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత జట్టు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. పంత్‌ ప్రదర్శన గురించి చెప్పాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన గౌతీ.. ‘‘ఈ మ్యాచ్‌లో మనకు మరో మూడో సెంచరీలు కూడా ఉన్నాయి.

అవి కూడా అతిపెద్ద సానుకూల అంశాలే. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. అయితే, యశస్వి బాదిన 100, కెప్టెన్‌గా అరంగేట్రంలోనే గిల్‌ చేసిన శతకం.. కేఎల్‌ రాహుల్‌ 100 గురించి కూడా మీరు ప్రస్తావించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని.

వీరు ఒక్కో సెంచరీ చేస్తే రిషభ్‌ పంత్‌ రెండు శతకాలు బాదాడు. ఒక్క టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు. నిజం చెప్పాలంటే.. ఇదొక గొప్ప ప్రదర్శన. ఏదేమైనా మీ ప్రశ్న ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది’’ అని కౌంటర్‌ ఇచ్చాడు.

అంత అసహనం ఎందుకు?
ఈ మేరకు గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ కాగా... పంత్‌ ఫ్యాన్స్‌ అతడిపై ఫైర్‌ అవుతున్నారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా పంత్‌ సాధించిన రికార్డులను ప్రస్తావిస్తూ గౌతీని విమర్శిస్తున్నారు. కాగా ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన రెండో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా పంత్‌ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు ఆండీ ఫ్లవర్‌ ఈ ఘనత సాధించాడు.

మరోవైపు.. ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన ఏడో భారత బ్యాటర్‌గా పంత్‌ నిలిచాడు. అయితే, టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో ఓడటంతో అతడి వీరోచిత ప్రదర్శన వృథాగా పోయింది. ఇరుజట్ల మధ్య జూలై 2- 6 వరకు బర్మింగ్‌హామ్‌ వేదికగా రెండో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్‌ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement