
India vs England 1st Test Day 3 Report: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆదివారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ 23.5 ఓవర్లు ఆడి రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ కంటే 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147)లతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు దీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మరోవైపు.. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సరికి మొత్తంగా 96 పరుగుల లీడ్లో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఈసారి నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 47, కెప్టెన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.