చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నిర్ణయాత్మక మూడో టెస్టులో గెలవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉండగా.. పర్యాటక కివీస్పై పట్టు బిగించేందుకు ఇంగ్లండ్ సన్నద్ధమైంది.
నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా న్యూజిలాండ్ నిర్దేశించిన 373 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది ఇంగ్లండ్. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.
అంతకుముందు న్యూజిలాండ్ ఓవర్నైట్ స్కోరు 120/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించి 9 వికెట్లకు 288 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డరైల్ మిచెల్ (100 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించగా... రచిన్ రవీంద్ర (94; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు.
ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో విజయం సాధించాలంటే ఆఖరి రోజైన సోమవారం ఆటలో ఇంగ్లండ్ జట్టు 270 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ కివీస్ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం కెన్నింగ్టన్ ఓవల్లో న్యూజిలాండ్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇంగ్లండ్ను ఏకంగా 253 పరుగుల తేడాతో మట్టికరిపించి 1-1తో సిరీస్ను సమం చేసింది.
ఈ క్రమంలో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసిన కివీస్.. రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 354 పరుగులకే ఆలౌట్ కాగా.. నాలుగో రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.


