
ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసే పనిలో బీసీసీఐ
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్కతాలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్ గార్డెన్స్లో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్లో వన్డే మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.
దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్ వేదికలపై కూడా అపెక్స్ కౌన్సిల్ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్ సీజన్లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది.
టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్కప్ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్తోనే సరిపెట్టుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి!