రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు | - | Sakshi
Sakshi News home page

రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు

Sep 24 2023 1:10 AM | Updated on Sep 25 2023 2:19 PM

జర్మనీలోని కొట్టింగన్‌ సిటీలో బనావత్‌ పవన్‌ కుమార్‌ నాయక్‌ - Sakshi

జర్మనీలోని కొట్టింగన్‌ సిటీలో బనావత్‌ పవన్‌ కుమార్‌ నాయక్‌

పుల్లల చెరువు మండలం సుద్దకురువ గిరిజన తండా నుంచి బనావత్‌ పవన్‌కుమార్‌ నాయక్‌ జర్మనీలో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు నాయక్‌ రైతు. తనకున్న 35 సెంట్లతో పాటు, ఐదు ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు కరాళ నృత్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది. ఇక పవన్‌కుమార్‌ చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నా కొడుకు ఆసక్తి గమనించిన తల్లి పద్మావతి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తూ వస్తోంది. పవన్‌కుమార్‌ కూడా చదువుపై దృష్టిని లగ్నం చేశాడు.

జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికై జర్మనీలో చదువుకుంటున్నాడు. వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పవనకుమార్‌ తల్లికి ఇంటి పట్టా ఇచ్చి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆమెకు ప్రతి నెలా వితంతు పెన్షన్‌ రూ.2,750 ఇచ్చి ఆదుకుంటోంది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక అప్పుల పాలయ్యామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నా బిడ్డను జర్మనీ పంపించి చదివిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది .

Advertisement
 
Advertisement
Advertisement