సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత మూడేళ్లలో ఏకంగా 5,88,419 మంది విద్యార్థులు తగ్గినట్లు.. మంగళవారం స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో వెల్లడించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 40,50,031 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లోకేశ్ తాజా ప్రకటనలో ఆ సంఖ్య గణనీయంగా.. ప్రస్తుతం 34,61,612కు పడిపోయింది. అంటే మొత్తం 5,88,419 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
మండలిలో ప్రశ్నకు సమాధానంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ ఈ వివరాలను వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం సభ ముందుంచింది. నిన్న.. వివాదాస్పదమైన డీఎస్సీ అంశంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆయన పరోక్షంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేశ్ అట్టర్ఫ్లాప్ షో కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
విద్యాశాఖపై చర్చ..
నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థుల మళ్లింపు వంటి అంశాలపై చర్చకు ఈ గణాంకాలు దారితీశాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.


