కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య | vikramaditya slams on Kangana Ranaut bjp picks imported leader | Sakshi
Sakshi News home page

కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్య

May 6 2024 7:47 AM | Updated on May 6 2024 7:48 AM

vikramaditya slams on Kangana Ranaut bjp picks imported leader

సిమ్లా:  సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని  కంగనా రనౌత్‌  దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్‌ కాంగ్రెస్‌ మంత్రి విక్రమాధిత్య సింగ్‌ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.

‘‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్‌ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.

గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్‌ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్‌ ప్రదేశ్‌కు కేవలం టూర్‌ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్‌కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్‌పూర్‌లలో చివరి విడత జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఫతితాలు జూన్‌ 4న వెలువడనున్నాయ.

Advertisement
 
Advertisement
Advertisement