చెన్నై: స్వాతంత్య్ర వేడుకలో ముందు వరుసలో కూర్చున్న నటి త్రిషపై డీఎంకే అధికార పత్రిక మురసొలి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం రాసింది. విజయ్-త్రిష పరస్పరం సెల్యూట్ చేసుకోవడం గురించి విమర్శించింది. ‘‘సిగ్గులేని ప్రదర్శన’’ అంటూ మండిపడింది.
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సన్నిహిత స్నేహితురాలు త్రిషపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కొన్ని రోజులకే, ఆ పార్టీ అధికార పత్రిక సీఎంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తీవ్ర పదజాలంతో రాసిన సంపాదకీయంలో.. ‘‘శనివారం ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన వేడుకల్లో ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెతో పరస్పరం సెల్యూట్ చేసుకున్నారు’’ అంటూ ఆ పత్రిక విజయ్ను తీవ్రంగా విమర్శించింది. విజయ్ ప్రవర్తనను మర్యాదకు విరుద్ధమని అభివర్ణించింది.
విజయ్ గౌరవం గాలిలో..
“స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి విజయ్ గౌరవం గాలిలో కలిసిపోయింది. ఎలాంటి సిగ్గు, సంకోచం లేకుండా ఆయన ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెతో పదేపదే అటూ ఇటూ సెల్యూట్ చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసినవారు కూడా జీర్ణించుకోలేని దృశ్యం ఇది” అని పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. పసుపు రంగు చీర ధరించిన ఆమె, విజయ్ జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో, వేడుకల కార్యక్రమాలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు సెల్యూట్ చేస్తూ కనిపించారు.
ప్రధాన అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు మే నెలలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.
విజయ్తో ఈ నటి స్నేహం చాలాకాలంగా ఊహాగానాలు, గాసిప్కు కారణమవుతోంది. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితంలో బహిరంగంగా చర్చకు వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ అంశంపై మరింత చర్చ జరిగింది.


