సీమలోనూ సీను సితారే! | Simmadhirappanna Comment: Kutami Fask in Rayalaseema | Sakshi
Sakshi News home page

సీమలోనూ సీను సితారే!

Jun 16 2025 10:51 AM | Updated on Jun 16 2025 12:34 PM

Simmadhirappanna Comment: Kutami Fask in Rayalaseema

ఈసారి పదిమంది గెలవడం కష్టమే!

గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి ఇదీ మా బ్రాండ్.. ఇదీ మా స్టైల్ అని చెప్పుకునే విధంగా అడుగులు మొదలెట్టారు. దీంతో ప్రజల్లో వీళ్ళు ఏదో చేస్తారు?.. అనుకుంటే చివరకు రౌడీయిజం చేస్తున్నారా అనే అభిప్రాయాలూ మొదలయ్యాయి. 

తెలుగుదేశానికి మొదట్నుంచి పట్టున్న జిల్లాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా ప్రజలకు ఏదో చేస్తాం.. పథకాలిస్తాం.. ఉద్యోగాలిస్తాం.. పారిశ్రామిక ప్రగతి చేసి చూపిస్తాం అంటూ ఘనంగా చెప్పుకుని వచ్చిన ఈ నాయకులు. వస్తూనే రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కో పేజీలో ఎవరి పేర్లు ఉన్నాయి.. వారిలో అధికారులు ఎవరు ? వైఎస్సార్‌సీపీ నాయకులూ ఎవరన్నది ఏరుకుని మరీ టార్గెట్ చేసి కేసులు పెట్టడం.. లొంగనివారిపై.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడం వంటి పనులు తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమీ చేయలేదన్న అభిప్రాయం మొదలైంది. దీంతోబాటు.. 

పల్లెల్లో చిల్లర రాజకీయాలు చేయడం.. ఆలయాల్లో విధ్వంసాలు.. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు.. ఇలాంటి అవలక్షణాలు తప్ప కాన్ఫిడెంట్ గా ప్రభుత్వాన్ని నడిపే పనిలో లేకపోవడాన్ని ప్రజలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత లోలోన నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. బయటకు అందరూ ఆహా.. ఓహో అని అంటున్నా.. ప్రజల్లో మాత్రం ఇది ఉత్త డబ్బారాయుడి ప్రభుత్వం అనే అభిప్రాయం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో.. 

మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన స్థానాల్లో సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల అబ్బే.. ఏదో అనుకున్నాం.. ఏం లేదు అనే భావన వినిపిస్తోందని అంటున్నారు. బాబు పాలన ఏడాదైన సందర్భంగా  కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవానికి వైయస్ జగన్‌కు గట్టిపట్టున్న రాయలసీమలో కూడా 2024 ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 52 సీట్లున్న పూర్వపు రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూటమికి 45 స్థానాలు దక్కాయి. వైఎస్సార్సీపీ కడపలో 3, చిత్తూరు.. కర్నూలులో రెండేసి చొప్పున మొత్తం ఏడు స్థానాల్లోనే గెలిచింది. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది సర్వేలు చెబుతున్నాయి.  

సీమలో గెలిచినా 45 మందిలో పట్టుమని పదిమందికి కూడా ప్రజల్లో పట్టు చిక్కలేదు. అందుకే ఏకంగా 33 మందిమీద తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందులో 29 మంది ఎమ్మెల్యేలకు అయితే అనవసరంగా వీళ్ళను ఎందుకు గెలిపించామురా దేవుడా అని ప్రజలు లోలోన బాధపడుతున్నారట. వాళ్ళు మళ్ళీ గెలవడం అసాధ్యమని ప్రజలు చెబుతున్నారు. ఇక ఇటు వైసిపి నేతలు.. ఓడిపోయినా ఎమ్మెల్యేలమీద ప్రజలకు గురికుదిరిందని.. వాళ్ళుంటేనే బావుణ్ణని ప్రజలు అనుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తానికి చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా నిలిచిపోతారని అంటున్నారు. అధికారం వచ్చింది సొంత ఆస్తులు పెంచుకోవడానికి అనే భావనలో ఉన్న నాయకులకు గడ్డుకాలమే అని అంటున్నారు.

- సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement