సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో ! | Pawan Kalyan Attitude Towards Leaders Who Do Not Get Party Tickets, Details Inside - Sakshi
Sakshi News home page

సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !

Apr 12 2024 8:43 PM | Updated on Apr 13 2024 11:20 AM

Pawan kalyan Attitude Towards Leaders Who Do Not Get Party Tickets - Sakshi

నచ్చినట్లు సీట్లు... క్యాడరుకు పాట్లు 

కనీసం అపాయింట్మెంట్, ఓదార్పు కూడా లేదు 

పవన్ తీరుతో రగిలిపోతున్న సీనియర్ నేతలు 

తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత.

అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్‌ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు.

తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది.

పోతిన మహేష్ టికెట్‌ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్‌ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు.

మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ  ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. 

దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్  అయిపోతున్నారు.

--సిమ్మాదిరప్పన్న 

Advertisement
 
Advertisement
Advertisement