
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్పై వివిధ వర్గా ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మా ర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించడంతో పాటు అధిక శాతం ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాల రూపకల్పనపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో.. అధ్యక్షుడి మార్పు, ప్రత్యక్ష, పరోక్ష రూ పాల్లో ప్రభావం చూపిన ఇతర అంశాలతో పార్టీలో, కేడర్లో ఏర్పడిన స్తబ్ధత తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీపరంగా, సొంతంగా వివిధ స్వతంత్ర సంస్థలు, ఏజెన్సీల ద్వారా పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, తదితరులు నిర్వహించిన సర్వేల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా తేలిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత బలా న్ని ఇంకా సమకూర్చు కోలేదన్న విషయం కూడా స్పష్టమైన ట్టు విశ్వేశ్వర్రెడ్డి వంటి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని బీజేపీ భావిస్తోంది.
మోదీ సభలతో ఊపు!
అక్టోబర్ 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల ద్వారా ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటం పార్టీకి కచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి, వివిధ వర్గాలు, రంగాలకు ప్రయోజనం చేకూర్చే చర్యలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు లాంటివి చేయడం ద్వారా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి తప్పకుండా ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఈ పాజిటివ్ ఓటింగ్ కచి్చతంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని నేతలు విశ్వసిస్తున్నారు.
6న నడ్డా దిశానిర్దేశం
ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే అక్టోబర్ 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఇక్కడకు వస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ విస్తృత సమావేశంలో పాల్గొననున్న నడ్డా..పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణ విషయంలో స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలు–పార్టీకి ముడిపడిన అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించడంతో పాటు రాష్ట్రంలో జాతీయ పార్టీ అనుసరించబోతున్న ఎన్నికల వ్యూహాన్ని కూడా స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. ఈ భేటీ సందర్భంగా పార్టీ ఎన్నికల రోడ్మ్యాప్ ఖరారు, పార్టీ మేనిఫెస్టో, అభ్య ర్థుల ఎంపిక తదితర అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్టు ముఖ్యనేతలు తెలిపారు.
పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయం, ఐక్యంగా ముందు కెళ్లడం, అసంతృప్త నేతలు కలిసి పనిచేయడంపై నడ్డా పలు సూచనలు చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పూర్తిగా అనుకూల పరిస్థితులున్నాయని, వాటిని సరైన పద్ధతుల్లో ఉపయోగించుకుని, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించే దిశలో కేంద్ర మంత్రులు మొదలు సామాన్య కార్యకర్త దాకా అంకితభావంలో పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామంటూ నడ్డా హితవు పలికే అవకాశం ఉందని అంటున్నారు.
వచ్చేనెలలో వరుసగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు పాల్గొనేలా కార్యక్రమాలు ఖరారు చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం.