ఖమ్మంలో అమిత్‌షా సభ  అదిరిపోవాలి..

Constituency wise appointment of incharges for Khammam Sabha - Sakshi

టెలి కాన్ఫరెన్స్‌లో బీజేపీ శ్రేణులకుబండి సంజయ్‌ దిశానిర్దేశం 

ఖమ్మం సభ కోసం నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ గుండెల్లో డప్పులు మోగేలా ఈనెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను దేశవ్యాప్త ప్రచారం చేయడం లక్ష్యంగా ‘మహా జన సంపర్క్‌ అభియాన్‌’పేరిట నిర్వహిస్తున్న బీజేపీ అగ్రనేతల పర్యటనల్లో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.

అమిత్‌షా సభ ఏర్పాట్లకు సంబంధించి శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్‌ బూత్‌ కమిటీల సభ్యులతో సంజయ్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించే సత్తా బీజేపీ నాయకులకు ఉందా? అంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. వారికి కనువిప్పు కలిగేలా, ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించే సమయం వచ్చింది.

ఐదు రోజులే గడువుంది. ప్రతి ఒక్కరూ కసితో పనిచేయాలి.. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభను సక్సెస్‌ చేద్దాం.’’అని సూచించారు. ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘నేను ఖమ్మం సభకు పోతున్నా.. మీరూ వస్తున్నారా?’అంటూ విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. 

భద్రాద్రి రాములోరి దర్శనానికి అమిత్‌షా 
బహిరంగ సభకు 15న ఖమ్మం విచ్చేస్తున్న అమిత్‌షా భద్రాచలం వెళ్లి శ్రీ రాముల వారిని దర్శించుకుంటారు. ఈ పర్యటనలో భాగంగానే హైదరాబాద్‌లో పార్టీ పూర్వ కార్యకర్తలు, సీనియర్‌ కార్యకర్తలతో కూడా అమిత్‌షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కాగా, మహా జనసంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 25న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగసభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ మేడ్చల్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రోడ్‌షో, నల్లగొండ పట్టణంలో బహిరంగసభలో పాల్గొంటారు. 

లక్ష జనసమీకరణ లక్ష్యం 
ఖమ్మం పట్టణంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్నార్‌ మైదానంలో నిర్వహించే అమిత్‌ షా బహిరంగ సభకు జన సమీకరణపై బీజేపీ దృష్టి సారించింది. లక్ష మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించి సభను సక్సెస్‌ చేయాలని నిర్ణయించింది. అందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించారు.

ఉమ్మడి జిల్లాలోని 47 మండలాలు, 3 మున్సిపాలిటీలతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో నియమితులైన ఇంచార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ ఇన్‌చార్జిలు నియోజకవర్గాల్లోనే మకాం వేసి పోలింగ్‌ బూత్‌ల వారీగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్‌ రావు, మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   

ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే 
♦ పని చేసేందుకు సిద్ధం..  బిస్తర్‌ కూడా రెడీ 
♦మీడియా ప్రతినిధులతో బండి సంజయ్‌ 
♦ అధ్యక్ష మార్పుపై మీడియా వార్తలు పట్టించుకోవడం లేదని స్పస్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా , ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనను మారుస్తారని మీడియాలో వచ్చిన వార్తలు పట్టించుకోవడం లేదన్నారు. అవన్నీ కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. ఐతే ఏ నిర్ణయం తీసుకున్నా బిస్తర్‌ రెడీగా పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు.

శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో బండి సంజయ్‌ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ’’కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, రాష్ట్ర అధ్యక్ష పదవి తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. మా పార్టీలో అలాంటి లీకులకు తావుండదు’’అని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర మంత్రి పదవి దక్కినప్పుడు వారి పేర్లు బయటటకు వచ్చాయా? అని ప్రశ్నించారు. తాను పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేస్తాననీ, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదన్నారు. బీజేపీలో జాయినింగ్స్‌ కోసం ఎవరో వస్తారని తాము ఎదురుచూడమని బండి స్పష్టం చేశారు. 

బీఆర్‌ఎస్‌కి బీజేపీతోనే పోటీ 
బీఆర్‌ఎస్‌తోనే బీజేపీకి ప్రధాన పోటీ తప్ప కాంగ్రెస్‌తో కాదని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ చేయించుకున్న సర్వేలోనే బీజేపీకి ఆదరణ పెరిగినట్టు తేలిందని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ కూడా అదే తేల్చిందన్నారు. అందుకే కేసీఆర్‌ బీజేపీకి భయపడి కాంగ్రెస్‌ను జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఏర్పడితే, బీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌లో అభ్యర్థులే కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇబ్బంది పడుతోందన్నారు. కాంగ్రెస్‌ లో ఇక్కడి నుంచి కాకపోతే పాకిస్తాన్‌ నుంచి అయినా చేర్చుకోనివ్వండి.. మాకేం ఇబ్బంది లేదన్నారు. కవితపై ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోందని చెప్పారు. చార్జిïÙట్‌ లో పేరు లేకుంటే బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు మధ్య ఒప్పందం కుదరినట్లా అని బండి ప్రశ్నించారు. తప్పు చేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top