సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైనందుకు టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్మరణ సభకు వెళ్లడాన్ని తప్పుబడుతూ ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా.. చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వివరణ తీసుకునే బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించినట్లు సమాచారం.
రగిలిపోతున్న కాపులు
ఈ పరిణామంపై టీడీపీలోని కాపు నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ఒక దివంగత నేత సంస్మరణ సభకు హాజరుకావడాన్ని కూడా తప్పుగా చూడటమేంటన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. పారీ్టలోని కాపు నేతలపైనే ఇలా ఆంక్షలు పెడుతుండటాన్ని తాము సహించలేకపోతున్నామని వారంటున్నారు. ముద్రగడ మరణించాక కూడా ఆయనపై శత్రుత్వ భావాన్ని కొనసాగించడంపై చర్చ పార్టీలో మొదలైంది. బతికున్నప్పుడు ఆయన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయతి్నంచి.. ఇప్పుడు ఆయన సంస్మరణ సభకు వెళ్లిన సొంత ఎమ్మెల్యే పైనే చర్యలకు సిద్ధపడటంపై కాపు సామాజికవర్గంలో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరణించిన నాయకుడికి నివాళి అర్పించే విషయంలో కూడా రాజకీయ రంగులు పులమడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.


