భూములు లాక్కోడానికి నీ అయ్య జాగీరు కాదు: రేవంత్‌పై ఈటల ఫైర్‌ | BJP MP Etela Rajender Aggressive Comments on CM Revanth | Sakshi
Sakshi News home page

హామీల చర్చపై రేవంత్ సవాలుకు ఈటల సై..

Nov 19 2024 2:28 PM | Updated on Nov 19 2024 3:23 PM

BJP MP Etela Rajender Aggressive Comments on CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌.  మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని తెలిపారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేసిందన్న ఈటల.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారని ప్రస్తావించారు. అయితే ఫోర్త్ సిటీ పేరుతో ఆ 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

కొడంగల్‌లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా.. బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్‌. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని గుర్తు చేశారు. లగచర్ల చుట్టూ పక్కల గ్రామాల సమస్య మాత్రమే కాదని, ప్రతీ రైతు తమ దగ్గరకు సమస్య వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. రైతులు నక్సలైట్లు కాదని, వాళ్లు వేరే వాళ్ళ భూములు అడగడం లేదని పేర్కొన్నారు

రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారని ఈటల పేర్కొన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. రేవంత్‌లా  ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదని తెలిపారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా.. ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

రేవంత్.. నీ స్థాయి ఎంత?
రేవంత్. నీ స్థాయి ఎంత?. హారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు. ఈ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నాలుగు వేల రూపాయలు నెలనెలా ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్‌సీలు ఎందుకు ఇవ్వడం లేదు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని స్వయంగా కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. 

రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు
 

సవాల్‌ స్వీకరిస్తున్నా..
హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు. మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు.. 420 హామీలపై చర్చిద్దాం.’ అని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement