సాక్షి, కర్నూలు జిల్లా: రెడ్బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలు చేస్తూ.. విరూపాక్షిని అరెస్ట్ చేయించారని.. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీశారు.
‘‘అధికార దుర్వినియోగం ఏస్థాయిలో ఉందో విరూపాక్షి అక్రమ అరెస్టే ఉదాహరణ. ఏపీలో బాధితులే నిందితులవుతున్నారు. దాడికి గురైనవారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో వందల మంది పోలీసులు.. దొంగల మాదిరి విరూపాక్షి ఇంటి కిటీకీలను ధ్వంసం చేశారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మందిని ఇరికించారు. రెండో కేసులో మరో 14 మందిని చేర్చారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. మొత్తం 38 మందిని జైలుకు పంపారు. కార్యకర్త గిరిని తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా.. దారిలో ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చేయిని విరగగొట్టారు. తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపాడు. పైగా ఆమెతో తప్పుడు మాటలు చెప్పించారు
..ఎమ్మెల్యే అనుచరులు చింపారని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. భర్తే భార్య బట్టలు చింపుతున్న వీడియో బయటకొచ్చింది. బాబు కుట్ర రాజకీయాలు చూసి రాష్ట్రం షాక్కు గురైంది. కారును ధ్వంసం చేశారని ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. వాళ్లే కారును ధ్వంసం చేసి.. ఎమ్మెల్యేపై మూడో కేసు పెట్టారు. పీఎస్కు వెళ్లి గిరి, శ్రీరాములు చూపించి ఫిర్యాదు చేశారు. కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


