భువనేశ్వర్: రాష్ట్రంలో పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) ఎన్నికలకు ఒడిశా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించిందని ఎస్ఈసీ కార్యదర్శి సంతోష్ కుమార్ దాస్ శనివారం తెలిపారు. జాతీయ జనాభా గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనగణన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి నెలలో అధికారిక ప్రకటన జారీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్ పదవుల కోసం ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను ప్రచురించిన అనంతరం ఎస్ఈసీ ప్రాథమిక పనులను ప్రారంభిస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసిన తర్వాత కమిషన్ తదుపరి ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను చేపడుతుంది.
రిజర్వేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ
రాష్ట్రంలో 35 పట్టణ పాలక సంఘాల అధ్యక్షుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ఉత్తర్వును జారీ చేసింది. సాధారణ ప్రజలు 15 రోజుల్లోపు తమ అభ్యంతరాలు, సూచనలు ఇవ్వవచ్చని ప్రకటించారు. ఈ సూచనలను మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కానుండగా, ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో జారీ అయ్యే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఏప్రిల్–మే నెలల్లో ఏకకాలంలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్ఈసీ వద్ద మున్సిపల్ ఎన్నికల కోసం సుమారు 12,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) ఉన్నాయి. అదనంగా 6,000 మెషీన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసిన తర్వాత ఇంటింటి సర్వే కూడా నిర్వహించబడుతుంది. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీ)లో సులభమైన మరియు అవాంతరాలు లేని ఓటింగ్ను నిర్ధారించడానికి ప్రతి వార్డులో ఒక పోలింగ్ బూత్ ఉంటుందని పేర్కొన్నారు.


