పర్లాకిమిడి: బాలల అక్రమ రవాణా అరికట్టాలని వక్తలు అన్నారు. గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ జిరంగో గ్రామంలో బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జన సచేతన కార్యక్రమం జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సమావేశానికి చైల్డ్లైన్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ లక్ష్మీదేవి, పంచాయతీ సర్పంచ్ రిసపా భుయ్యాన్, పంచాయతీ ఈవో రసపాత్రో, వార్డు మెంబర్లు హాజరయ్యారు. ఇటీవల జిరంగో పంచాయతీలో కొంతమంది బాలలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా వెట్టి చాకిరీ కోసం రవాణా చేస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు బాలలను పనికి పంపుకుండా బడికి పంపాలని డీసీపీవో అరుణ్ త్రిపాఠి సూచించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సత్యబాన్ సాహు తదితరులు పాల్గొన్నారు.


