రాయగడ: సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్లను అందిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై ఆపరేషన్ నేత్రలో భాగంగా ఝార్సుగుడ పోలీసులు మరో కీలక విజయాన్ని సాధించారు. ఈ కేసులో పరారీలొ ఉన్న ప్రధాన నిందితుడు ప్రతీక్ సింగ్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. ఝార్సుగుడ పోలీస్స్టేషన్లో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిందితుడు అరెస్టు నుంచి తప్పించుకుని పరారీలొ ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సుదీర్ఘ గాలింపు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝార్సుగుడ జిల్లా రైల్వే కాలనీలోని తెలుగు పడ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. నేరగాళ్లు స్థానిక ప్రజలను నగదు ఆశ చూపించి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించేవారు. అనంతరం ఆ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, ఇంటర్నెంట్ బ్యాంకింగ్ వివరాలు వంటి పూర్తి అకౌంట్ కిట్లను సేకరించి సైబర్ నేర ముఠాలకు లేదా ఇతర రాష్ట్రాల్లోని వారి సహచరులకు అందజేసేవారు. ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా మోసపూరితంగా వచ్చిన డబ్బును బదిలీ చేయడం, ఉపసంహరించడం ద్వారా దర్యాప్తును తప్పుదొవ పట్టించే ప్రయత్నం చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఝార్సుగుడ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అపరిచితుల మాటలు నమ్మి డబ్బు కోసం బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా ఏటీఎం కార్డులు, పాస్బుక్లు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులకు అప్పగించడం చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి చర్యల వల్ల అమాయకులు కూడా సైబర్ మోసాల కేసుల్లో నిందితులుగా మారే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


