భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథ యాత్రలో మహా అన్న ప్రసాదాలు (ఒబొఢా) అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అడపా ఒబొఢా సేవనతో అనేక జన్మల పాపాల నుంచి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది యాత్ర నాలుగో రోజు ఆదివారం నుంచి స్వామి వారి జన్మస్థలమైన గుండిచా ఆలయంలో తొలి అడప దర్శనం లభ్యత ప్రారంభమైంది. ప్రాతః ధూపం అనంతరం ఒబొఢా విడుదల చేశారు. అడపా మండపంపై భగవంతుని దర్శనంతో పవిత్ర ఒబొఢా లభ్యతతో భక్తులలో ఉత్సాహం రెట్టింపైంది. ఆదివారం మొదటి రోజు కావడంతో భక్తుల తాకిడి అసాధారణంగా ఉంది. రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ వ్యవస్థ గుండా భక్తులు వరుస క్రమంలో శ్రీ గుండిచా మందిరం లోనికి ప్రవేశించి అడపా మండపంపై మూల విరాట్లను దర్శించుకుంటున్నారు. సింహ ద్వారం గుండా గుండిచా ఆలయం లోనికి ప్రవేశించి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు నక్కొ చొణా ద్వారం గుండా బయటకు వెళ్తున్నారు. ఆదివారం మంగళ హారతి తర్వాత ఉదయం 9.55 గంటలకు సర్వ దర్శనం ప్రారంభమైంది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా చాలా మంది భక్తులు గంటల తరబడి బారులు తీరి నిలబడాల్సి వస్తుంది. దీని కారణంగా భక్తులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. స్పృహ కోల్పోవడం, ఊపిరాడని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉందని పలువురు హితవు కోరుతున్నారు. సువార్ మహాసువార్ ఆదేశాల మేరకు 50 వేల మంది భక్తుల కోసం వివిధ రకాల వంటకాలతో ఒబొఢా సిద్ధం చేశారని సేవా సిబ్బంది తెలిపారు.


