
చెన్నై: నేటి తరం యువత ప్రేమ, వ్యామోహంతో క్షణికావేశంలో నిండు జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మేఘాలయాలో సోనమ్ రఘువంశీ, అనంతరంపురంలో శిరీష,హైదరాబాద్ జీడిమెట్ల తేజశ్రీ.. తాజాగా చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. ఇలాంటివి రోజుకు ఎన్నో కథలు.. వ్యథలు.
చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రెనే జోషిల్డా డెలాయిట్లో సీనియర్ రోబోటిక్స్లో కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఓ ప్రాజెక్ట్ సందర్భంగా బెంగళూరులో డివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే, ప్రేమ,దోమ ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషిల్డా ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మనసు ముక్కలైంది. దీంతో డివిజ్ ప్రభాకర్ఫై ప్రతీకారానికి దిగింది. ప్రేమ పిచ్చితో అతగాడికి మనశాంతి లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది.
బాంబు బెదిరింపులతో దేశవ్యాప్తంగా అలజడి
అ తర్వాత డివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసింది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూల్స్,ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క అహ్మదాబాద్లోనే 21 ప్రదేశాలకు బెదిరింపులు పంపింది. మోతేరా నరేంద్ర మోదీ స్టేడియం, సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్, సివిల్ హాస్పిటల్ వంటి ప్రదేశాలు ఇందులో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బెదిరింపులు కలకలం రేపాయి.
రీసెంట్గా ఎయిరిండియా విమాన ప్రమాదం
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే ఎయిరిండియా విమానం టేకాఫ్ తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీకి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో ‘మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందేమో’ అని పేర్కొంది. ఈ బెదిరింపు మెయిల్ను రెనే జోషిల్డా పంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఒక చిన్న తప్పిదమే ఆమెను పట్టించేసింది
టెక్నాలజీలో నిపుణురాలైన రెనే జోషిల్డా టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్, వర్చువల్ నంబర్లను ఉపయోగించి తన డిజిటల్ ట్రేస్ను దాచింది. కానీ ఆరు నెలల క్రితం ఆమె ఓ చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పట్టించేసింది. ఒకసారి తన ఒరిజినల్ ఐపీ నెంబర్ నుంచి ఫేక్ ఈమెయిల్స్ను ఓపెన్ చేసింది. బెదిరింపు కాల్స్తో అప్రమత్తమైన సైబర్ పోలీసులు రెనే జోషిల్డా ఐపీ అడ్రస్ను గుర్తించారు. అమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.