పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.
కేతన్ను లోహన్గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.
దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


