Representative image
భోపాల్: ఒక చిన్న ఇల్లు అది.. పోలీసులు తలుపులు తెరిచారు అంతే.. బయటికి కనిపించని ఓ భారీ రహస్యం ఒక్కసారిగా బయటపడింది. సాధారణంగా కనిపించే ఆ ఇంట్లో దాచిన డబ్బును చూసి అక్కడికి వెళ్లిన వారే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
మధ్యప్రదేశ్లోని సాగర్లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో పోలీసులకు రూ.3 కోట్లకు పైగా నగదు దొరికింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లింది డబ్బు కోసం కాదు.. సోషల్ మీడియాలో ఆ డ్రైవర్ చేతిలో కనిపించిన పిస్టల్ ఫొటోపై విచారణ కోసం.
గోపాల్గంజ్ పోలీస్లు ఆటో డ్రైవర్ సౌరభ్ అహిర్వార్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఓ లాక్ చేసిన అల్మారా కనిపించింది. దాని తాళం కుటుంబ సభ్యుల వద్ద లేకపోవడంతో పోలీసులు నిబంధనల ప్రకారం దాన్ని తెరిచారు. అందులో 4 బ్యాగుల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.
ఒక్క బ్యాగులోనే సుమారు రూ.1.33 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు బ్యాగుల్లో కలిపి మొత్తం రూ.3 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తేలింది. డబ్బును లెక్కించేందుకు కరెన్సీ కౌంటింగ్ మెషీన్ ఉపయోగించారు. సోదాలు, నగదు లెక్కింపు ప్రక్రియను వీడియోలో రికార్డు చేశారు.
ఈ డబ్బు తమది కాదని కుటుంబ సభ్యులు చెప్పారు. రమేశ్ అహిర్వార్ అనే బంధువు డబ్బును 8-9 నెలల క్రితం అక్కడ ఉంచి వెళ్లారని వారు తెలిపారు. రమేశ్ అహిర్వార్ భోపాల్లోని చునాభట్టి ప్రాంతంలో ఉంటారని, పీడబ్ల్యూడీలో ఇంజినీర్గా పనిచేస్తున్నారని కుటుంబం చెబుతోంది.
అయితే రూ.3 కోట్ల నగదును ఎందుకు ఇంట్లో ఉంచారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపు పన్ను, రెవెన్యూ తదితర సంబంధిత విభాగాలకు కూడా సమాచారం ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఆ డబ్బు పీడబ్ల్యూడీ ఇంజినీర్దేనని పోలీసులు నిర్ధారించలేదు. అది రమేశ్ అహిర్వార్దేనని కుటుంబ సభ్యులు చేసిన వాదన మాత్రమే. పోలీసులు నగదు మూలాన్ని విచారిస్తున్నారు.


