ఉత్తరప్రదేశ్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున చైనా మాంజాతో ఓ ప్రయాణికుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో చోటుచేసుకుంది. కౌశాంబి పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాలోని అక్బర్పూర్ బెహ్రాంపూర్కు చెందిన రవి రాజ్ తన స్నేహితుడు నరేశ్తో కలిసి మోటార్సైకిల్పై వెళ్తున్నాడు.
అయితే, కౌశాంబి పోలీస్స్టేషన్ ఎన్హెచ్-9పై యూపీ గేట్ సమీపంలో వంతెనపై వారు చేరుకోగానే.. గాలిలో వేలాడుతున్న మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. మాంజా పదునుగా ఉండటంతో రవి మెడకు తీవ్ర గాయమై, మెడ ఎముక వరకు తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన చోటు తీవ్ర గందరగోళం పరిస్థితి ఏర్పడింది. గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా ఇందిరాపురం ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు.
అయితే, ఈ ప్రమాద ఘటన సుమారు 2 గంటల సమయంలో ఢిల్లీ ఎక్స్ప్రెస్వే సమీపంలో జరిగినట్లుగా, ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మాంజాతో మెడకు తీవ్ర గాయం కావడంతో రవి రక్తమోడుతూ కనిపించగా, అతడి స్నేహితుడు గాయంపై వస్త్రాన్ని ఉంచి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రవి ఆన్లైన్ డెలివరీ పని చేసేవాడని, అతడి స్వస్థలం బిహార్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా వాడటం నిషేధం ఉన్నప్పటికీ ఈ వినియోగం ఎలా జరుగుతోందనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఏసీపీ మాట్లాడుతూ.. పదునైన ఈ మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. నిషేధిత మాంజాను విక్రయించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ విక్రయాలను అడ్డుకునేలా పర్యవేక్షణ పెంచుతామని వారు తెలిపారు.


