క‌న్న పిల్ల‌ల‌ను చిత‌క‌బాదిన త‌ల్లి.. వీడియో తీసిన తండ్రి | Video: Siblings Cry, Beg For Mercy As Mother Beats Them With Belt Mumbai | Sakshi
Sakshi News home page

క‌న్న పిల్ల‌ల‌ను చిత‌క‌బాదిన త‌ల్లి.. వీడియో తీసిన తండ్రి

Jul 3 2024 2:55 PM | Updated on Jul 6 2024 11:51 AM

ముంబై: మ‌హారాష్ట్ర‌లో అమానుష ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ త‌ల్లి క‌నిక‌రం లేకుండా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌పై ఇష్టానుసారంగా చేయి చేసుకుంది. క‌న్న ప్రేమ‌ను మ‌రిచి బెల్టుతో కొడుకు, కూతురిని చిత‌క‌బాదింది. పిల్ల‌లు దెబ్బ‌ల‌తో అల్లాడిపోతుంటే, ఈ తతంగాన్నంతా తండ్రి త‌న ఫోన్‌లో వీడియో తీస్తూ.. భార్య‌ను ఆప‌క‌పోవ‌డం కొస‌మెరుపు.

ముంబైలోని వాన్‌రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ దారుణం జ‌రిగింది. ఓ మహిళ తన కూతురు, కొడుకును తీవ్రంగా కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  పిల్ల‌లు గుక్క‌ప‌ట్టి ఏడుస్తూ, కొట్ట‌వద్ద‌ని త‌ల్లిని వేడుకోవ‌డం వీడియోలో క‌నిపిస్తోంది. అయినా ఆగ‌ని ఆ మ‌హిళ వారిని చెంప‌దెబ్బ‌లు, బెల్టుతో చిత‌క‌బాదింది. 

ఇక ఆ ఘోరాన్ని ఆపాల్సింది పోయి.. ఈ దృశ్యాల‌ను క‌న్న తండ్రి వీడియో తీశాడు. వీడియో రికార్డ్ చేయమని తన భర్తను ఆమె కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి వివాహిత త‌న పిల్ల‌ల‌పై ఈ విధంగానే ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌జె కథవాలా ఈ వ్యవహారంపై బాలల రక్షణ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.  త‌ల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముంబై పోలీసు కమిషనర్‌కు కూడా లేఖ రాశారు.చర్య తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీని పంపినట్లు రిటైర్డ్ జడ్జి కథవాలా తెలిపారు.

మ‌రోవైపు భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రులు.. పిల్లల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఇప్పుడు బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పిల్లలిద్దరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement