సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది. దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.
ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.
ఆ రోజు ఏం జరిగింది?
2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.
AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు.


