ఎలివేషన్‌ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే! | From Reel to Real: How Cinema Is Rewriting Politics | Sakshi
Sakshi News home page

ఎలివేషన్‌ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!

Jun 27 2026 5:00 PM | Updated on Jun 27 2026 5:00 PM

From Reel to Real: How Cinema Is Rewriting Politics

ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.

ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్‌గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!

తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.

అయితే ఈ ట్రెండ్‌కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్‌ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.

అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం.

ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్‌లు విస్తృతంగా వినిపించాయి.

అంతేకాదు, కేజీఎఫ్, జైలర్‌లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్‌లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్‌లా అన్న సందేహం కలగడం సహజమే.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్‌ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.

అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!"..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement