పార్లమెంట్ ఉభయసభల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, ఎంపీల ఫిరాయింపులు, ప్రభుత్వ అనుకూల కూటముల్లో చేరికల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా అధికార ఎన్డీయే బలం పెరగడం, అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి కొంత బలహీనపడిన నేపథ్యంలో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులు, రెండు పెండింగ్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయోధ్యలోని రామాలయంలో కోట్ల కొలది విరాళాల చోరీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, మోదీ సర్కార్ విదేశాంగ విధానంపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లు, లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులను ఈసారి అజెండాలో లేకపోయినా వీటిపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశంలో పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, కొన్ని నిబంధనలను సవరించడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను(సవరణ) బిల్లు–2026ను వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
విదేశీ నిధులు స్వీకరించే సంస్థలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, పారదర్శకత పెంపు, పర్యవేక్షణను బలోపేతం కోసం విదేశీ విరాళాల నియంత్రణ(సవరణ) బిల్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సౌలభ్యం, వ్యాపార నిర్వహణలో సరళీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్కరణ బిల్లు, పుట్టిన తేదీ నమోదు, డిజిటల్ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రతిపాదనతో జనన నమోదు చట్ట సవరణ బిల్లుతోపాటు జాతీయ పతాకం, జాతీయ గీతం, రాజ్యాంగ విలువలకు సంబంధించిన చట్టాలను నవీకరించేందుకు జాతీయ గౌరవ అవమాన నివారణ(సవరణ) బిల్లు–2026ను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
రెండు పెండింగ్ బిల్లులను తదుపరి ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ఇందులో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు ఉంది. పెరుగుతున్న కేసుల భారం తగ్గించి, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ధ్యేయంగా ఈ బిల్లును రూపొందించారు. ఉన్నత విద్యా రంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ విద్యా అధిష్టాన్ బిల్లు–2025ను సైతం కేంద్రం ప్రవేశపెట్టనుంది.
అవినీతి, ధరల పెరుగుదల..
వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, రాజ్యాంగబద్ధ సంస్థల దురి్వనియోగం, విపక్షాలను విచ్ఛిన్నం చేయడం, ధరల పెరుగుదల, విదేశాంగ విధానంలో వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, ఇథనాల్ బ్లెండింగ్ విధానాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై దాడులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడంపైనా ఆందోళన చేపట్టాలని ప్రతిపక్షాల నిర్ణయించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేయబోతున్నాయి. 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు పలకడం, శివసేన(యూబీటీ)లో చీలికలు, డీఎంకే దూరం జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో విపక్షాల ఐక్యత, బలం కాస్తంత తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష నాయకులు ఎంతమేరకు ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. సమావేశాలు వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
‘వందేమాతరం’ను అవమానిస్తే మూడేళ్ల జైలు
సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
జాతీయ గేయం ‘వందేమాతరం’ను అవమానించడం, ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ను నేడు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే, ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణ ‘వందేమాతరం’కూ వర్తించనుంది.
కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానాన్ని అడ్డుకున్నా, ఆలాపిస్తుండగా అంతరాయం కలిగించినా వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా చట్టం చేయనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించి, రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా అమల్లోకి వస్తుంది. దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడం, స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం పోషించిన చారిత్రక పాత్రకు తగిన గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తీసుకొస్తోంది.


