న్యూఢిల్లీ: రాబోయే నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ‘ఎల్నినో’పరిస్థితులు వేగంగా బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కరువులు, భారీ వర్షాలు, ఇతర తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. డబ్ల్యూఎంఓ గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ ప్రకారం..
ఈ సంవత్సరం జూలై–సెప్టెంబర్ మధ్యకాలంలో ఎల్నినో వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఎల్నినోగా మారనుంది. ఎల్నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వెంబడి సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు, దానిపై ఉన్న వాతావరణంలో హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించే ఒక వాతావరణ దృగ్విషయం. ‘‘ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇవి వేగంగా బలపడి ఒక శక్తివంతమైన ఎల్నినోగా మారుతాయని అంచనా వేస్తున్నాం.
ఇది అనేక ప్రాంతాల్లో కరువు, భారీ వర్షపాతం సంభవించే అవకాశాలను, అలాగే భూమిపై వడగాడ్పులు, సముద్రపు వేడిగాలుల ముప్పును తీవ్రతరం చేస్తుంది’’అని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో చెప్పారు. ఎల్నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని జూన్ 12న భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాల కాలంలో అవి మరింత బలపడతాయని ఐఎండీ పేర్కొంది.


